రూ.3వేల పెన్షన్‌పై నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి మడత పేచీ: అచ్చెన్నాయుడు

by Seetharam |
రూ.3వేల పెన్షన్‌పై నాలుగున్నరేళ్లుగా జగన్ రెడ్డి మడత పేచీ: అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : పెన్షన్ల పెంపు పేరుతో వృద్ధులు, వితంతువులు, వికలాంగుల్ని దగా చేయడం తప్ప జగన్ రెడ్డి సాధించిందేమీ లేదు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికలకు ముందు ఊరూరా తిరిగి పెన్షన్లు రూ.3వేలు చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఏటా రూ.250 చొప్పున పెంపు అంటూ హామీపై మడమ తిప్పారు అని మండిపడ్డారు. ఆ మాట ప్రకారం పెంచినా 2022 నాటికే రూ.3వేల పెన్షన్ ఇవ్వాలి.కానీ ఇప్పుడు ఎన్నికలకు మరో మూడు నెలల కాలం ఉందనగా రూ.3వేలు చేస్తున్నామంటూ, కేబినెట్లో ఆమోదిస్తున్నామంటూ హడావుడి చేయడం సిగ్గుచేటు అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రూ.3వేల హామీపై మడమ తిప్పి ఒక్కో పెన్షన్ దారుడికి జగన్ రెడ్డి దాదాపు రూ.32 వేల వరకు ఎగనామం పెట్టాడు అని ఆరోపించారు. ఇదేనా పేదలపై చిత్తశుద్ధి? ఇదేనా పెన్షన్ దారులపై శ్రద్ధ? అని నిలదీస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘తెలుగుదేశం ప్రభుత్వ సగటు ఏడాది బడ్జెట్ రూ.1.41 లక్షల కోట్లు మాత్రమే అయినప్పటికీ రూ.200 ఉన్న పెన్షన్ రూ.2000 చేశాం. ఐదేళ్లలో రూ.1,800 పెంచాం. 20 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం. వృత్తి కార్మికులకు కొత్తగా పెన్షన్లు మంజూరు చేశాం.ట్రాన్స్ జెండర్లకు పెన్షన్లిచ్చాం’ అని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. ‘జగన్ రెడ్డికి సగటు ఏడాది బడ్జెట్ రూ.2.29 లక్షల కోట్లకు పైగా బడ్జెట్ ఉన్నప్పటికీ ఐదేళ్లలో పెంచిన పెన్షన్ మొత్తం కేవలం రూ.750 మాత్రమే. కొత్తగా మంజూరు చేసిన పెన్షన్లూ అంతంత మాత్రమే. మరోవైపు ట్రాన్స్ జెండర్స్, బ్రాహ్మణ పెన్షన్లు రద్దు చేశారు. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ అంటూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు నోటీసులు పంపిన నీచపు చరిత్ర జగన్ రెడ్డిది మాత్రమేనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే.. మొదటి ఏడాది నుండే రూ.3వేల చొప్పున పెన్షన్ అందేది. ఎల్లకాలం ప్రజల్ని మాటలతో మాయం చేయడం సాధ్యం కాదని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Advertisement

Next Story