ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగింపు కర్కశత్వం : చంద్రబాబు

by Seetharam |
ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగింపు కర్కశత్వం : చంద్రబాబు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆంక్షల పేరుతో ప్రభుత్వం దివ్యాంగురాలికి పెన్షన్ తొలగించింది. ప్రభుత్వం పెన్షన్ నిలిపివేయడంతో తాను ఎలా బతకాలో తెలియని స్థితిలో సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నక్కనదొడ్డిలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే నక్కనదొడ్డికి చెందిన సరోజ అంధురాలు. పుట్టుకతోనే అంధురాలైన సరోజకు చిన్నప్పటి నుంచి పెన్షన్ వచ్చేది. అయితే ఆమె తమ్ముడికి రైల్వేలో ఉద్యోగం రావడం, అతడి పేరు కూడా రేషన్ కార్డులో ఉన్న కారణంగా ప్రభుత్వం పింఛన్ తొలగించింది. దీంతో సరోజ అధికారులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ‘ కొంచెం మానవత్వం చూపండి జగన్! మాటల్లో కాదు చేతల్లో..ఆంక్షల పేరుతో అంధురాలి పెన్షన్ తొలగింపు కర్కశత్వం. ఆమె ఆత్మహత్య అత్యంత హృదయవిదారకం’ అంటూ ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. ఏపీ హేట్స్ జగన్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను తన ట్వీట్‌కు జోడించారు.

ఇంకెంత మంది దివ్యాంగులు బలికావాలి : నారా లోకేశ్

దివ్యాంగురాలు సరోజ ఆత్మహత్య ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. సరోజ కళ్లు కనిపించవని, కళ్లుండీ ఆమె ప్రాణాలు రక్షించలేకపోయాని ఆరోపించారు. ఆమె తమ్ముడికి ఉద్యోగం వచ్చిందనే కారణం చూపి ఏడాదిగా పెన్షన్ నిలిపేయడం బాధాకరమన్నారు. తనకున్న ఏకైక ఆసరా కోల్పోయాననే బెంగతో సరోజ ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పుకొచ్చారు. ఇంకెంత మంది దివ్యాంగులు, వృద్ధులను బలి తీసుకుంటావు సైకో జగన్ అంటూ ముఖ్యమంత్రిపై నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed