Ap News: మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం

by srinivas |
Ap News: మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం
X

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండేందుకు అనేక కార్యక్రమాలతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్ అంటూ వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో కీలకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు ముహూర్తం సైతం ఫిక్స్ చేసింది. మే 9న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంపై ప్రకటన చేశారు. ప్రజలను వచ్చే వినతుల్ని సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా అత్యధిక అర్జీలు అందుకున్న ప్రభుత్వ విభాగాల అధిపతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు.

హెల్ప్‌లైన్ నంబర్ 1902

జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జగనన్నకు చెబుదాం, పేదలందరికీ ఇళ్లు, జగనన్న భూ హక్కు మరియు భూ రక్ష పథకం, నాడు-నేడుపై సీఎం సమీక్షించారు. చాలా ప్రతిష్టాత్మకంగా మే 9న ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా అమలు కావడానికి 1902 హెల్ప్‌లైన్‌ నంబర్ ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం నిర్వహిస్తోందని సీఎం జగన్ తెలిపారు. ఇప్పటికే స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమానికి మరింత మెరుగైన రూపమే జగనన్నకు చెబుదామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించడమే జగనన్నకు చెబుదామని తెలిపారు. ఇండివిడ్యువల్‌ గ్రీవెన్సెస్‌ను అత్యంత నాణ్యంగా పరిష్కరించడమే దీని ఉద్దేశం అని చెప్పుకొచ్చారు. హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి గ్రీవెన్స్‌ రిజిస్టర్‌ చేస్తే దాని అత్యంత నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీ, ఉన్నతాధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.


అధికారులు సన్నద్ధం కావాలి

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారులు సన్నద్ధం కావాలని సీఎం వైఎస్ జగన్ ఉన్నతాధికారులు, ప్రతి ప్రభుత్వ విభాగాధిపతికి తెలియజేశారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై ప్రతి వారం ఆడిట్‌ నిర్వహించాలని, దీనిపై ప్రతి వారం నివేదికలు తీసుకోవాలని సూచించారు. ఫిర్యాదుల ట్రాకింగ్, పర్యవేక్షణ జరుగుతుందా? లేదా? అన్నదానిపై ప్రతివారం కూడా సమీక్ష చేయాలంటూ దిశానిర్దేశం చేశారు. సీఎంఓ, ప్రభుత్వ శాఖల అధిపతులు, జిల్లాలు, డివిజన్‌ స్థాయిలో, మండల స్థాయిలో మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయని వీటిని కలెక్టర్లు తప్పనిసరిగా మానిటర్‌ చేయాలని సీఎం జగన్ వెల్లడించారు. గ్రీవెన్స్‌ పరిష్కారంలో క్వాలిటీని పెంచడం అన్నది ప్రధాన లక్ష్యం కావాలని సీఎం సూచించారు.

‘ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల ద్వారా పర్యవేక్షణ చేస్తేనే అది సాధ్యం. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లను సీఎంఓ కూడా పర్యవేక్షిస్తుంది. హెల్ప్‌లైన్‌ద్వారా గ్రీవెన్స్‌ వస్తాయి. వాటిని నిర్దేశిత సమయంలోగా నాణ్యతతో పరిష్కరించాలి. గ్రీవెన్స్‌ ఇచ్చిన వ్యక్తికి సంతృప్తి కలిగించడం అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఇండివిడ్యువల్‌, కుటుంబం స్థాయిలో గ్రీవెన్సెస్‌. రిజ్టసర్‌ అయిన గ్రీవెన్సెస్‌ ఫాలో చేయడం. ప్రభుత్వ సేవలు, పథకాలపై ఎంక్వైరీ. ముఖ్యమంత్రి సందేశాలను నేరుగా చేరవేయడం అన్నది జగనన్నకు చెబుదాం ప్రధాన కార్యక్రమాలు ఉంటాయి’. అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు.

ప్రజలతో నేరుగా మమేకం

‘ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి నేరుగా ప్రజలతో కనెక్ట్‌ అయి ఉంటారు. వారి గ్రీవెన్స్‌స్‌ను సలహాలను నేరుగా తెలియజేయవచ్చు. ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం ఈ గ్రీవెన్స్‌స్‌ను నిర్దేశిత సమయంలోగా పరిష్కారం అయ్యేలా చూస్తుంది. ఐవీఆర్ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ల ద్వారా తాము చెప్పిన సమస్యల పరిష్కారంపై ప్రజలకు రెగ్యులర్‌ అప్‌డేట్స్ అందుతాయి. అంతేకాక ఇదే హెల్ప్‌లైన్‌ ద్వారా సమస్యల పరిష్కారంపై అర్జీదారులనుంచి ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటుంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వాలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి 1902 హెల్ప్‌లైన్‌ గురించి అవగాహన కల్పించాలి’. అని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకునేలా వారిని మరింతగా ప్రోత్సహించాలని సూచించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమల్లో మూడు కీలక యంత్రాంగాల ఉంటాయన్నారు. సీఎం కార్యాలయం నుంచి మండల కార్యాలయాల వరకూ ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్లు ఉంటాయని చెప్పారు. ప్రతి జిల్లాకు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు ప్రత్యేకాధికారులుగా ఉంటారు. క్రమం తప్పకుండా ఆయా జిల్లాలను వీరు సందర్శించి పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రతి 15 రోజులకోసారి సంబంధిత జిల్లాలను పర్యవేక్షిస్తారని, కలెక్టర్లతో కలిపి జగనన్నకు చెబుదాం కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారన్నారు.

‘సమస్యల పరిష్కారాల తీరును రాండమ్‌గా చెక్‌ చేస్తారు. ప్రాజెక్ట్‌ మానిటరింగ్‌ యూనిట్ల పనితీరును పర్యవేక్షిస్తారు. ఎక్కడైనా సంతృప్తి లేకపోతే దాన్ని తిరిగి ఓపెన్‌ చేస్తారు. ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ఎస్ ద్వారా వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా దాన్ని తిరిగి తెరుస్తారు. పరిష్కార తీరుపై పూర్తిస్థాయిలో సమీక్ష చేస్తారు. చీఫ్‌ సెక్రటరీ, సీఎంఓ, డీజీపీతో కలిసి రెగ్యులర్‌గా మానిటర్‌ చేస్తారు. ప్రతి 15 రోజులకోసారి పూర్తి స్థాయిలో సమీక్ష ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి పేరు పెట్టారు అంటే మొత్తం ప్రభుత్వం యంత్రాంగం పేరు పెట్టినట్టే. అధికారుల మీద ఆధారపడే ముఖ్యమంత్రి తన విధులను నిర్వహిస్తారు. మీరు అంత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహిస్తే కార్యక్రమం సమర్థవంతంగా సాగుతున్నట్టే లెక్క. ప్రజలకు నాణ్యంగా సేవలను అదించాలన్నదే దీని ఉద్దేశం. ప్రతి కలెక్టర్‌కు రూ.3 కోట్ల రూపాయలను తక్షణ నిధులుగా ప్రభుత్వం ఇస్తుంది. అవసరమైన చోట ఈ డబ్బును ఖర్చు చేయవచ్చు. వీటిని ఖర్చు చేసే అధికారం కలెక్టర్‌కు ఇస్తున్నాం. దీనివెల్ల వేగవంతంగా గ్రీవెన్స్‌స్‌ పరిష్కారంలో డెలవరీ మెకానిజం ఉంటుంది. ఇవి సక్రమంగా పనిచేస్తే చాలావరకు సమస్యలు సమసిపోతాయి. అందుకే అవి సమర్థవంతంగా పనిచేయడం అన్నది చాలా ముఖ్యమైన విషయం.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.

Next Story

Most Viewed