Venkaiah Naidu: ప్రధాని మోడీతో మాట్లాడాను.. సాయం చేస్తామని హామీ ఇచ్చారు

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-02 15:24:38.0  )
Venkaiah Naidu: ప్రధాని మోడీతో మాట్లాడాను.. సాయం చేస్తామని హామీ ఇచ్చారు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో వరద కష్టాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.5 లక్షల చొప్పున సహాయం అందజేశారు. కుండపోత వర్షాలు, ఉధృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాటిల్లుతున్న నష్టం నన్ను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాను. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడాను, అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు టచ్‌లో ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారు.

రెండు రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. నా వంతు సహకారంగా నా వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు లక్షల రూపాయలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఐదు లక్షల రూపాయలు సహాయ చర్యల నిమిత్తం పంపించాను. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. యువత కూడా పెద్ద ఎత్తున ముందుకొచ్చి సహాయక చర్యల్లో పాల్గొవాలని కోరుతున్నాను. మా కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి మరో రూ 2.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు అందజేశారు. మా కుమార్తె దీపా వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు అందజేశారు’ అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed