బెయిలా? జైలా?: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు

by Seetharam |
బెయిలా? జైలా?: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు
X

దిశ, డైనమిక్ బ్యూరో : స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ వస్తోందా? రిమాండ్‌కు వెళ్తారా? అనేది మరికాసేపట్లో తేలిపోనుంది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. చంద్రబాబు నాయుడుకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించగా...బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థలూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఈ కేసులో నేడు తీర్పును వెల్లడించనుంది హైకోర్టు. గతంలో తీర్పు రిజర్వు చేసిన ఏపీ హైకోర్టు మధ్యాహ్నం 2.15 గంటలకు తీర్పు వెలువరిస్తామని లిస్ట్‌లో న్యాయమూర్తి పేర్కొన్నారు.


నవంబర్ 16న తీర్పు రిజర్వ్

స్కిల్ స్కాం కేసులో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబునాయుడు అనారోగ్య సమస్యలతో మధ్యంతర బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సుదీర్ఘ వాదనలు అనంతరం ఏపీ హైకోర్టు వాదనలు ముగిసినట్లు నవంబర్ 16న ప్రకటించింది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఎప్పుడు తీర్పు వెల్లడిస్తామో అనేది తెలియజేయలేదు. అయితే తాజాగా న్యాయమూర్తి నేడు మధ్యాహ్నం 2.15గంటలకు తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి లిస్ట్‌లో పేర్కొన్నారు. ఇకపోతే గత వాదనలలో చంద్రబాబు నాయుడుకు సంబంధించి డేమేజ్ స్టేట్మెంట్లు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇచ్చారని సిద్ధార్థ లూథ్రా వాదించారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు హెల్త్ రిపోర్టులు ఫాల్స్ అని ఏఏజీ వాదించడంపైనా సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక లెజండరీ పర్సన్‌కు సంబంధించి హెల్త్ రిపోర్ట్ విషయంలో ఫాల్స్ అని వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు. దీంతో ఏపీ హైకోర్టులో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్‌పై వాడి వేడిగా వాదనలు జరిగిన సంగతి తెలిసిందే.

బెయిల్ ఇవ్వొద్దన్న ఏఏజీ పొన్నవోలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు మెడికల్ రిపోర్టులలో తప్పులు ఉన్నాయని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. స్కిల్ స్కాం కేసులో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్లు చేతులు మార్చారని ఏఏజీ పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు తరలించారని..బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్‌ల ద్వారా ఈ విషయం బయట పడిందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. బోస్, కన్వేల్కర్ మెసేజ్‌ల ఆధారంగా మొత్తం డబ్బు హైదరాబాద్ చేరినట్లుగా తెలిసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీమెన్స్ కంపెనీ కుంభకోణం జరిగిందని..నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే.

చంద్రబాబును ఇరికించే కుట్ర: సిద్ధార్థ లూథ్రా

చంద్రబాబు నాయుడును స్కిల్ స్కాం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని వాదించారు. రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు గుండె, చర్మ సంబంధిత వ్యాధులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడును ఇరికించేందుకే ఫోరెన్సిక్ రిపోర్ట్ తయారు చేశారని ఆరోపించారు. ఇప్పటికే చంద్రబాబు కంటికి శస్త్రచికిత్స జరిగిందని..ఇందుకోసం మరింత వైద్యం చేయించుకోవాల్సి ఉందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలియజేశారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారని...దానికి మరింత వైద్యం చేయించుకోవాల్సి ఉందని అందువల్లే రెగ్యులర్ బెయిల్ కోరుతున్నట్లు హైకోర్టులో సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు నాయుడుకు సంబంధించి డేమేజ్ స్టేట్మెంట్లు ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇచ్చారని సిద్ధార్థ లూథ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు హెల్త్ రిపోర్టులు ఫాల్స్ అని ఏఏజీ వాదించడంపైనా సిద్ధార్థ లూథ్రా కౌంటర్ ఇచ్చారు. ఇరువాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed