టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దూకుడు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-25 06:20:51.0  )
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ దూకుడు
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం కేసును టేకోవర్ చేసుకున్న సీఐడీ కేసు విచారణలో దూకుడు పెంచింది. ప్రధాన నిందితుడు వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్యను కస్టడీకి ఇవ్వాలని మంగళగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న చైతన్య సోమవారం రోజున మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపైన, చంద్రబాబు నివాసంపైన దాడి కేసులను సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మంగళగిరి పోలీసులు మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు 25 మంది వైఎస్సార్సీపీ నేతలను అరెస్టు చేశారు. లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌ను విచారించారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసుని విచారిస్తున్న తాడేపల్లి పోలీసులు మాజీమంత్రి జోగి రమేష్ తోపాటు పలువురిని విచారించారు. కొందరిని అరెస్టు చేసి రిమాండ్​కు పంపించారు. అయితే కేసుల విచారణ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదని, రెండు ప్రధాన ఘటనలకు సంబంధించిన కేసుల్ని కూటమి ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed