AP Politics:బీసీలంతా పరిటాల కుటుంబం వైపు.. ప్రకాష్ రెడ్డి గుండెల్లో రైళ్లు!

by Disha Web Desk 18 |
AP Politics:బీసీలంతా పరిటాల కుటుంబం వైపు.. ప్రకాష్ రెడ్డి గుండెల్లో రైళ్లు!
X

దిశ ప్రతినిధి,అనంతపురం:కొన్ని దశాబ్దాలుగా మీ వెంట నడిచి.. కాంగ్రెస్ జెండాను, ఆ తర్వాత వైసీపీ జెండాను మోసిన నాయకులు మా వైపు రావడాన్ని బట్టి మీ పతనం ఎప్పుడో ప్రారంభమైనట్టు స్పష్టమవుతోందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. అనంతపురం రూరల్ మండలం అక్కంపల్లి పంచాయతీ సదాశివ నగర్ కాలనీలో జయహో బీసీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానికంగా వైసీపీకి చెందిన బీసీ నాయకులు, కార్యకర్తలు 70 కుటుంబాలవారు తెలుగుదేశం పార్టీలో చేరారు.

పరిటాల సునీత స్వయంగా వీరందరికీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ ప్రస్తుతం పార్టీలోకి వస్తున్న వలసలు చూస్తుంటే.. కొన్ని గ్రామాల్లో వైసీపీకి ఏజెంట్లు కూడా ఉండే పరిస్థితి లేదన్నారు. ఊళ్లకు ఊళ్లే వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారన్నారు. బీసీలకు న్యాయం చేసేది ఒక్క టీడీపీ మాత్రమేనన్నారు. గత ఎన్నికల్లో బీసీల్లో చాలా మంది వైసీపీకి ఓటు వేశారని, అయినా కనీసం ఒక్క రుణమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. బీసీల ద్రోహి గా ఉన్న వైసీపీకి బుద్ధి చెప్పాలని సునీత పిలుపునిచ్చారు.

4 మండలాల నుంచి 100 కుటుంబాలు టీడీపీలోకి చేరిక..

రామగిరి మండలం మాదాపురం, నసనకోట పంచాయతీల నుంచి 15 కుటుంబాల వారు, రాప్తాడు మండలం ఎర్రగుంట గ్రామానికి చెందిన 11 కుటుంబాల వారు, కనగానపల్లి నుంచి 4 కుటుంబాల వారు , అనంతపురం రూరల్ మండలంలోని పలు కాలనీలకు చెందిన 70కుటుంబాలవారు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ మాజీ మంత్రి సునీత, పరిటాల సిద్ధార్థ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒ‍క్కరికీ సముచిత స్థానం ఉంటుందని.. టీడీపీ విజయం కోసం కృషి చేయాలని సూచించారు.



Next Story

Most Viewed