ప్రోటీన్ పౌడర్‌తో పరేషానే..! యువతకు ఐసీఎంఆర్ కీలక హెల్త్ అలర్ట్

by Disha Web Desk 14 |
ప్రోటీన్ పౌడర్‌తో పరేషానే..! యువతకు ఐసీఎంఆర్ కీలక హెల్త్ అలర్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజుల్లో యువత మార్కెట్లో దొరికే ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సర్వసాధారణమైంది. ముఖ్యంగా జిమ్‌కి వెళ్లే యువత ఎక్కువగా ప్రొటీన్లు తీసుకుంటున్నారు. కారణం జిమ్‌కి వెళ్లి, వర్కవుట్‌లపై చేసినప్పుడు, కండరాలను నిర్మించడానికి శరీరానికి ప్రోటీన్ ఇవ్వడం అవసరం. దీని కోసం, తరుచుగా ఈ సప్లిమెంట్లను ఆశ్రయిస్తారు. ఈ ప్రోటీన్ పౌడర్ వాడకం వల్ల అనారోగ్యానికి గురువుతారని నిపుణులు చెబుతున్నా కూడా వందలు ఖర్చుపెట్టి పౌడర్ కొంటున్నారు. మరోవైపు అథెట్లు సైతం సప్లీమెంట్స్ వాడవద్దని చెబుతున్నారు. అయితే, ప్రోటీన్ పౌడర్‌ సప్లిమెంట్ల‌పై హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఐసీఎంఆర్) తాజాగా కీలక హెల్త్ అలర్ట్ ఇచ్చింది. సాధారణ ప్రజలకు, క్రీడాకారులకు ప్రోటీన్ సప్లిమెంట్ల వినియోగానికి వ్యతిరేకంగా సలహా ఇచ్చింది.

నాన్-కమ్యూనికేబుల్ వ్యాధులు

ప్రోటీన్ సప్లిమెంట్లలో గుడ్లు, పాలు, పాల విరుగుడు, సోయాబీన్స్, బఠానీలు, బియ్యం వంటి వివిధ వనరుల నుంచి తయారు చేస్తారన్నారు. వాటితో పాటు చక్కెరలు, కృత్రిమ స్వీటెనర్లు, ఫ్లేవర్స్ కలిగి ఉంటాయని తెలిపింది. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడానికి సిఫారసు చేయబడలేదని పేర్కొంది. పాలవిరుగుడు ప్రోటీన్, ఈ సప్లిమెంట్లలో ఒక సాధారణ పదార్థం, బ్రాంచ్-చైన్ అమైనో ఆమ్లాలలో (బీసీఏఏఎస్) అధికంగా ఉంటుంది. ఇటీవల చేసిన అధ్యయనాల్లో అధిక బీసీఏఏలు నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల (ఎస్‌సీడీఎస్) ప్రమాదాన్ని పెంచుతాయని తేలింది. అధిక స్థాయిలో ప్రోటీన్ తీసుకోవడం, ముఖ్యంగా సప్లిమెంట్ పౌడర్లు అనవసరం, హానికరం అని ఐసీఎంఆర్ నొక్కి చెప్పింది. ప్రోటీన్ తీసుకునే వారు సప్లిమెంట్లపై ఆధారపడకుండా, సమతుల్య ఆహారం ద్వారా వారి ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించింది.

Next Story

Most Viewed