అసలేమైంది.. సీఎం జగన్ సమీక్షకు ఎమ్మెల్యేల గైర్హాజరు

by sudharani |
అసలేమైంది.. సీఎం జగన్ సమీక్షకు ఎమ్మెల్యేల గైర్హాజరు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకం అన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం అమలు తీరుపైనే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారంటే ఎంతలా ఈ కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకున్నారో అర్థమవుతుంది. అంతేకాదు ఈ కార్యక్రమం అమలు తీరుపై సమీక్షా సమావేశం సైతం భారీగా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు, రీజినల్ కో ఆర్డినేటర్లతో కలిసి సమావేశమై భవిష్యత్ కార్యచరణపై దిశానిర్దేశం చేస్తున్న సంగతి తెలిసిందే.

అంతటి కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 3న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష ఉంటుందని వారం రోజుల క్రితమే వైసీపీ ప్రకటించింది. అయినప్పటికీ పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ముఖ్యమంత్రితో సమీక్ష సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆయన శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు.

రాగోలులో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం కొత్త చర్చకు దారి తీసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సీఎం వైఎస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీమంత్రి కొడాలి నానిలు సైతం డుమ్మా కొట్టారు. వీరితోపాటు ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఉమాశంకర్ గణేష్, బాల నాగిరెడ్డి, నవాజ్ బాషా, పీలేరు చింతల రామచంద్రా రెడ్డిలు సైతం గైర్హాజరయ్యారు. అయితే ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్లే సీఎం సమావేశానికి హాజరు కాలేదని ఆయా ఎమ్మెల్యేల అనుచరులు వెల్లడిస్తున్నారు.

Next Story

Most Viewed