పంజాబ్‌కు భారీ షాక్.. స్వదేశానికి స్టార్ ఆల్‌రౌండర్

by Harish |
పంజాబ్‌కు భారీ షాక్.. స్వదేశానికి స్టార్ ఆల్‌రౌండర్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో పేలవ ప్రదర్శన చేసిన పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 12 మ్యాచ్‌ల్లో కేవలం 4 విజయాలు నమోదు చేసిన ఆ జట్టు 8 పాయింట్లు మాత్రమే ఖాతాలో వేసుకుని లీగ్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. అయితే, పంజాబ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. మోకాలి గాయంతో సతమతమవుతున్న ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, ఇంగ్లాండ్‌కు చెందిన లివింగ్‌స్టోన్ స్వదేశానికి వెళ్లనున్నాడు. ఈ విషయాన్ని లివింగ్‌స్టోన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘ఐపీఎల్‌లో మరో ఏడాది పూర్తయింది. టీ20 ప్రపంచకప్ నాటికి మోకాలి గాయం నుంచి కోలుకోవాలి. మద్దతుగా నిలిచిన పంజాబ్ కింగ్స్‌ అభిమానులకు ధన్యవాదాలు. జట్టుగా, వ్యక్తిగతంగా నాకు ఈ సీజన్ నిరాశపరిచింది. కానీ, ఐపీఎల్‌లో ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేశాను.’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు.

కాగా, ఈ సీజన్‌లో లివింగ్‌స్టోన్ అంచనాలను అందుకోలేకపోయాడు. 7 మ్యాచ్‌ల్లో 22.20 సగటుతో 111 పరుగులే చేశాడు. కేవలం 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌నకు ప్రకటించిన ఇంగ్లాండ్ జట్టులో లివింగ్‌స్టోన్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌ జట్టులో భాగమైన ఆటగాళ్లు స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్లేయర్లకు సమాచారం పంపింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌కే ఆడుతున్న సామ్ కర్రన్, బెయిర్‌స్టోతోపాటు మొయిన్ అలీ(చెన్నయ్), విల్ జాక్స్(బెంగళూరు), ఫిల్ సాల్ట్(కోల్‌కతా), రీస్ టోప్లీ(బెంగళూరు), బట్లర్(రాజస్థాన్) కూడా త్వరలోనే ఇంగ్లాండ్‌కు వెళ్లనున్నారు. ఇక పంజాబ్ రెండు నామమాత్రపు లీగ్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ నెల 15న రాజస్థాన్‌తో, 19న హైదరాబాద్‌తో ఆడనుంది.

Advertisement

Next Story

Most Viewed