టీ20 ప్రపంచకప్‌లో వాళ్లద్దరిదే కీ రోల్ : శిఖర్ ధావన్

by Harish |
టీ20 ప్రపంచకప్‌లో వాళ్లద్దరిదే కీ రోల్ : శిఖర్ ధావన్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా విజయాల్లో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, జస్ప్రిత్ బుమ్రా కీలకంగా మారతారని భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ జోస్యం చెప్పాడు. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధావన్ మాట్లాడుతూ.. టీమ్ ఇండియా పొట్టి ప్రపంచకప్ గెలుస్తుందని చెప్పాడు. ఈ సందర్భంగా రోహిత్ కెప్టెన్సీపై విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘ప్రపంచకప్ టోర్నీల్లో భారత్‌పై ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. అయితే, రోహిత్ అనుభవజ్ఞుడు. అతని అనుభవం కచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒత్తిడిని ఎలా అధిగమించాలో అతనికి తెలుసు.’ అని చెప్పాడు.

అలాగే, ప్రపంచకప్‌లో కోహ్లీ, బుమ్రా సత్తాచాటుతారని తెలిపాడు. ‘విరాట్, బుమ్రా భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. విరాట్ చేజ్ మాస్టర్. అతను కచ్చితంగా ప్రత్యర్థులను నిరాశపరుస్తాడు. బుమ్రా అన్ని ఫార్మాట్లలో వరల్డ్ బెస్ట్ బౌలర్. భారత్ ప్రపంచకప్ గెలిస్తే అందులో కచ్చితంగా అతను ముఖ్య పాత్ర పోషిస్తాడు.’ అని చెప్పుకొచ్చాడు. శివమ్ దూబె, యుజువేంద్ర చాహల్, సంజూ శాంసన్‌లతో భారత జట్టు సమతూల్యంగా ఉందని చెప్పాడు.

కాగా, యువకుల రాకతో ధావన్‌కు జాతీయ జట్టులో చోటు కరువైంది. 2022 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌పై అతను టీమ్ ఇండియాకు చివరిసారిగా ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు, ఐపీఎల్-17లో అతని సారథ్యంలోని పంజాబ్ కింగ్స్‌ పేలవ ప్రదర్శన చేసి చివరి నుంచి రెండో స్థానంతో లీగ్‌ను ముగించింది. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను.. గాయం కారణంగా మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed