ఎస్సీ హాస్టల్ లో విద్యార్థి మృతి.. అస్వస్థతకు గురైనా పట్టించుకోని వార్డెన్..

by Sumithra |
ఎస్సీ హాస్టల్ లో విద్యార్థి మృతి.. అస్వస్థతకు గురైనా పట్టించుకోని వార్డెన్..
X

దిశ, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్)మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ లో ఉంటూ 7వ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు. విద్యార్థి మృతి పై బాలుడి తరుపు బంధువులు, విద్యార్థి సంఘాల నాయకులు ఏరియా ఆస్పత్రిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన మెల్లం శ్యామ్ కుమార్ (13) ఆత్మకూరు(ఎస్)లోని ఎస్సీ హాస్టల్ లో ఉంటూ మోడల్ స్కూల్లో చదువుకుంటున్నాడు. ఇతను చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోవడంతో ఆ కాలనీలోని తన పెద్దమ్మ చల్లప్ప సైదమ్మ ఇంట్లో ఉంటున్నాడు. 2023 లో 6వ తరగతిలో ఎస్సీ హాస్టల్ లో చేరాడు. ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. కాగా మంగళవారం సాయంత్రం శ్యామ్ కుమార్ తనకు హెల్త్ ఏదోలా ఉందని తన తోటి విద్యార్థులతో చెప్పినట్లు సమాచారం.

రాత్రి సుమారు 12 గంటల సమయంలో మూత్రం పోయడానికి లేచినట్లు తెలిపారు. తెల్లవారే సరికి విగతజీవిగా పడి ఉండటాన్ని విద్యార్థులు చూసి హాస్టల్ వార్డెన్ కి సమచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆ సమచారమే వార్డెన్ తమకు ఇచ్చాడని, తాము హాస్టల్ దగ్గరికి వెళ్ళే సమయం లోపే తమ బాబుని వార్డెన్ ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. తామూ వెంటనే ఏరియా ఆసుపత్రికి వచ్చి చూడగా నోటి నుండి నురగలు వచ్చినట్లు చెప్పారు. దీనితో బాబుని పలిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. గత 5 ఏళ్ల కిందట అనారోగ్యంతో మృతుడి తల్లి చనిపోగా, అతని తండ్రి 2 ఏళ్ల క్రితం చనిపోయాడు. అప్పటి నుండి ఆ బాలుడిని తన పెద్దమ్మ సాదుకుంటోంది. నాటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న తన బాబు ఇలా అకారణంగా చనిపోయాడంటూ బోరున విలపిస్తుండంతో స్థానికులకు కన్నీరు తెప్పించింది.

విషయం తెలుసుకున్న సూర్యాపేట ఆర్డీఓ ఆర్.వేణు మాధవ రావు, డీఎస్పీ జి.రవిలు ఏరియా ఆసుపత్రికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పరిశీలించి పోస్టు మార్టం నివేదిక అందాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని, అందుకు ఎవరైనా బాధ్యులని తేలితే శాఖ పరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. కాగా ఏరియా ఆసుపత్రిలో పలు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థి మృతి పై ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. విద్యార్థి మృతి బాధాకరంగా ఉందన్నారు. బాలుడి కుటుంబానికి రూ.50 లక్షలు అందజేసి న్యాయం చేయాలన్నారు. అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కాగా గత ఏడాది క్రితం ఇదే మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ బాలుడు తన గదిలోకి ఫ్యాన్ కి ఉరేసుకొని మృతి చెందిన విషయం తెలిసిందే.

పట్టించుకోని హాస్టల్ వార్డెన్....

మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్ గా ఉన్న పెరుమాళ్ల రవి సుమారుగా గత మూడేళ్లుగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ అతను ఉద్యోగ రీత్యా హాస్టల్ కి సమయానికి వెళ్ళడని, విద్యార్దులను అస్సలు పట్టించుకోడనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. మెనూ ప్రకారం భోజనం కూడా పెట్టించడని విశ్వసనీయంగా తెలిసింది. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు గాను గతంలోనూ శాఖ పరంగా రెండు షోకాజ్ నోటీసులు కూడా అందుకున్నట్లు సమాచారం.

Next Story