భారీ స్థాయిలో యూపీఐ మోసాలు..పోలీసుల అదుపులో 13 మంది..

by Aamani |
భారీ స్థాయిలో యూపీఐ మోసాలు..పోలీసుల అదుపులో 13 మంది..
X

దిశ, శేరిలింగంపల్లి : యూపీఐ మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. నాలుగు కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్ కు చెందిన 13 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.72 లక్షల నగదు, రూ.50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నరసింహ్మా మీడియా సమావేశంలో వెల్లడించారు.శంషాబాద్ సిసిఎస్, కేపీహెచ్ బీ, మాదాపూర్, నార్సింగి పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి యూపీఐ మోసాలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నారని, నిందితులు హైటెక్ యూపీఐ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ను టార్గెట్ గా చేసుకుని యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ఈ రాజస్థాన్ ముఠా. మూడు కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు నాలుగు కోట్ల రూపాయల యూపీఐ మోసాలకు పాల్పడింది ఈ ముఠా.

బజాజ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ఫిర్యాదు మేరకు ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టామని, మోసం చేయడానికి ముందు కస్టమర్లుగా ఎలక్ట్రానిక్ షో రూమ్ లకు వెళ్తున్న ముఠా సభ్యులు వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారు. అందుకు క్యూఆర్ కోడ్ ను రాజస్థాన్ లోని సహచరులకు పంపుతారు. వారు క్యూఆర్ కోడ్ తో చెల్లింపు చేస్తారు. వస్తువులు డెలివరీ అయ్యాక పొరపాటున తప్పుడు ట్రాన్సాక్షన్ చేస్తున్నామంటూ బ్యాంకును ఆశ్రయిస్తున్నారని, బ్యాంకు ఆదేశాలతో ఛార్జ్ ఆప్షన్ ద్వారా తిరిగి డబ్బు పొందుతున్నారు. దీంతో సంబంధిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారు నష్ట పోతున్నారు. రాజస్థాన్ కు చెందిన 20 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్న యువకులంతా కలిసి ముఠాగా ఏర్పడి యూపీఐ మోసాలకు పాల్పడుతున్నట్లు క్రైమ్ డీసీపీ నరసింహ్మా తెలిపారు. యూపీఐ మోసాల ద్వారా కొనుగోలు చేసిన వస్తువులను ఇతరులకు అమ్మి ఈ ముఠా సొమ్ము చేసుకుంటుందని,

నిందితులపై మూడు కమీషనరేట్ పరిధిలో పలు పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నాయన్నారు. సైబరాబాద్ లో ఆరు, రాచకొండలో రెండు, హైదరాబాద్ లో ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్ షో రూమ్ లో మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. గత మూడు నెలల వ్యవధిలో ఈ ముఠా బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో 1127 లావాదేవీలు జరిపినట్లు గుర్తించారు. ఈ మోసపూరిత లావాదేవీల ద్వారా రూ. 1.56 కోట్ల రూపాయలు తిరిగి వాళ్ళ అకౌంట్ లోకి తిరిగి పొందారు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ ప్రతినిధుల ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు దర్యాప్తు జరిపి రాజస్థాన్ కు చెందిన ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీసులను క్రైమ్ డీసీపీ నరసింహ్మా అభినందించారు.

Advertisement

Next Story