70 వేలు దాటిన తెలంగాణ కరోనా కేసులు

by Anukaran |   ( Updated:2020-08-05 11:43:47.0  )
coronavirus
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు మళ్ళీ రెండు వేలు దాటింది. గడచిన 24గంటల వ్యవధిలో రాష్ట్రం మొత్తం మీద 21,118 కరోనా పరీక్షలు చేస్తే అందులో 2,012 పాజిటివ్‌గా తేలాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,958గా నమోదైంది. ఇందులో సుమారు 72% మంది (50,814) డిశ్చార్జి కాగా ఇంకా 19,568 మంది ఆసుపత్రుల్లో, హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఒకేరోజున 13మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 576కు చేరుకుంది. హైదరాబాద్ నగరంలో కేసుల సంఖ్య స్థిరంగా 600లోపే కొనసాగుతున్నా జిల్లాల్లో మాత్రం పెరుగుతోంది. కొత్తగా వస్తున్న పాజిటివ్ కేసుల్లో దాదాపు మూడొంతులు జిల్లాల్లోనే ఉంటున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మంత్రి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు బోధనాసుపత్రులను సందర్శిస్తూ వీలైనంతగా బెడ్‌ల సంఖ్య పెంచడంపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని మొత్తం 55 ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు మూడున్నర వేల కొత్త బెడ్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మొత్తం సర్కారు ఆసుపత్రుల్లో ఏకకాలంలో 20 వేల మంది చికిత్స పొందే వీలు కలిగింది.

హైదరాబాద్ నగరంలో కొత్తగా 532 కేసులు నమోదుకాగా, పక్కనే ఉన్న రంగారెడ్డి జిల్లాలో 188, మేడ్చల్ జిల్లాలో 198 చొప్పున నమోదయ్యాయి. ఇక వరంగల్ అర్బన్ జిల్లాలో 127, ఖమ్మంలో 97, సంగారెడ్డిలో 89, నిజామాబాద్‌లో 83, కామారెడ్డిలో 75, కొత్తగూడెంలో 51, మహబూబ్‌నగర్‌లో 51, నల్లగొండలో 49, గద్వాలలో 48, భూపాలపల్లిలో 46, కరీంనగర్‌లో 41 చొప్పున నమోదయ్యాయి.

Advertisement

Next Story