ఘనంగా వైఎస్ఆర్ జయంతి

by  |
ఘనంగా వైఎస్ఆర్ జయంతి
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ ముఖ‍్యమంత్రి, దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని పురస్కరించుకుని కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన కుటుంబసభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ, కోడలు వైఎస్‌ భారతి రెడ్డి, కుమార్తె వైఎస్‌ షర్మిల, అల్లుడు బ్రదర్‌ అనిల్‌ కుమార్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ యంత్రాంగం అడుగడుగునా ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్కడ పకడ్బందీగా కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తోంది. ఎమ్మెల్యేలను సైతం థర్మల్ స్కానింగ్‌ చేసిన తర్వాత జయంతి కార్యక్రమానికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే కార్యక్రమానికి హాజరైన మీడియా సిబ్బంది, ఎమ్మెల్యేలకు కలెక్టర్ హరికిరణ్ కోవిడ్ పరీక్షలు చేయించారు.

వైఎస్సార్‌ జయంతి సందర్భంగా “నాలో.. నాతో వైఎస్సార్‌” పుస్తకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ కాసేపట్లో ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకాన్ని వైఎస్‌ విజయమ్మ రచించారు. వైఎస్సార్‌ స్వర్గస్థులైన నాటి నుంచి కలిగిన భావోద్వేగాల సమాహారం “నాలో.. నాతో వైఎస్సార్‌”. వైఎస్సార్‌ సహధర్మచారిణిగా వైఎస్‌ విజయమ్మ జీవితసారమే ఈ పుస్తకం. పుస్తకావిష్కరణ అనంతరం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. ట్రిపుల్ ఐటీ వద్ద వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా, వైఎస్సార్‌ జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed