Shooting: అమెరికాలోని స్కూల్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి

by vinod kumar |
Shooting: అమెరికాలోని స్కూల్‌లో కాల్పులు.. ముగ్గురు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మిస్సిస్సిప్పిలోని లెక్సింగ్టన్ నగరంలోని ఒక పాఠశాలలో దుండగులు కాల్పులు జరిపారు. ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం స్కూల్ గ్రౌండ్‌లో సంబురాలు చేసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆట ముగిసిన తర్వాత సుమారు 200 నుంచి 300 మంది ప్రజలు విజయోత్సవ సంబురాలు నిర్వహిస్తుండగా వారిపై నిందితులు కాల్పులు జరిగినట్లు హోమ్స్ కౌంటీ షెరీఫ్ విల్లీ మార్చ్ తెలిపారు. ఫైరింగ్ ప్రారంభమైన అనంతరం ప్రజలు పారిపోవడానికి ప్రయత్నించారని, దీంతో తొక్కిసలాట జరిగి ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. మరణించిన వారిలో ఇద్దరికి 19 ఏళ్లు కాగా, మూడో వ్యక్తికి 25 ఏళ్లు ఉంటాయని పేర్కొన్నారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనను విల్లీ మార్చ్ ఖండించారు. ఇది చట్టవిరుద్దమైందని తెలిపారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అయితే కాల్పులు జరపడానికి గల కారణాలను వెల్లడించలేదు. కాగా, అమెరికాలో ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అంతకుముందు సెప్టెంబరులో అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. అలాగే జార్జియా రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలో జరిగిన కాల్పుల్లో మరో నలుగురు మృతి చెందారు.

Advertisement

Next Story