భారత్-చైనా సరిహద్దు సమస్యలపై చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ చర్చలు

by Harish |
భారత్-చైనా సరిహద్దు సమస్యలపై చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ చర్చలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం కజకిస్థాన్‌లోని ఆస్తానాలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరు భారత్-చైనా సరిహద్దు సమస్యల గురించి చర్చించుకున్నారు. తూర్పు లడఖ్‌లో మిగిలిన సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి దౌత్య, సైనిక మార్గాల ద్వారా ప్రయత్నాలను రెట్టింపు చేయడానికి అంగీకరించారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ ఇరువురు నేతలు సమావేశమయ్యారు.

వారిద్దరి భేటీకి సంబంధించిన ఫొటోలను జైశంకర్ సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన వ్యాఖ్యానిస్తూ, ఎల్‌ఓసీని గౌరవించడం, సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను నిర్ధారించడం చాలా అవసరం. పరస్పర గౌరవం, సున్నితత్వం, ఆసక్తి రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తాయని అన్నారు. చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి భారత్-చైనా సరిహద్దు వ్యవహారాలపై కన్సల్టేషన్, సమన్వయంపై వర్కింగ్ మెకానిజం (WMCC) ముందస్తు సమావేశం నిర్వహించాలని వారు అంగీకరించారు.

ఈ భేటీలో ఎక్కువగా సరిహద్దు వివాదంపైనే చర్చలు సాగినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. గతంలో రెండు ప్రభుత్వాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్‌లకు పూర్తిగా కట్టుబడి ఉండటానికి ఇరు మంత్రులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే, ప్రపంచ పరిస్థితులపై అభిప్రాయాలను కూడా చర్చించారు. మే 2020లో గాల్వాన్‌లో జరిగిన ఘర్షణతో భారతదేశం, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత రెండు దేశాల విదేశాంగ మంత్రుల నుంచి ఈ విధమైన ప్రకటన రావడం గమనార్హం.

Next Story