Middle East: మసీదులో దాక్కున్న 5 మందిని చంపిన ఇజ్రాయెల్

by Harish |
Middle East: మసీదులో దాక్కున్న 5 మందిని చంపిన ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: మిడిల్‌ఈస్ట్‌లో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దళాలు దాడులు చేస్తూనే ఉన్నాయి. తాజాగా వెస్ట్ బ్యాంక్ నగరం తుల్కర్మ్‌లోని మసీదులో దాక్కున్న పాలస్తీనాకు చెందిన ఐదుగురిని ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ మిలిటరీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల్లో భాగంగా హెలికాప్టర్లు, డ్రోన్‌లతో తుల్కర్మ్, జెనిన్, జోర్డాన్ వ్యాలీలోని ప్రాంతాలపై విరుచుకుపడ్డారు. దాడుల కారణంగా పాలస్తీనా భూభాగాలైన గాజా, వెస్ట్ బ్యాంక్‌లోని రెండు ప్రధాన టెలికమ్యూనికేషన్ కంపెనీలలో ఒకటైన జవ్వాల్‌లో నెట్‌వర్క్ పూర్తిగా నిలిచిపోయింది.

తుల్కర్మ్ మసీదులో మరణించిన ఐదుగురిలో ఒకరు.. ముహమ్మద్ జబ్బర్ అని ఇజ్రాయెల్ తెలిపింది, ఇతన్ని "అబు షుజా" అని కూడా పిలుస్తారు, అతను నగరం పక్కన ఉన్న నూర్ షామ్స్ శరణార్థి శిబిరంలో సిబ్బంది నెట్‌వర్క్‌కు అధిపతి అని తెలిపారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్‌‌పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్, వెస్ట్ బ్యాంక్ నగరంలోని ప్రజలకు మద్దతు ఇచ్చిందని, తిరిగి ఎదురు దాడులు చేయడానికి అక్కడి వర్గాలకు ఆయుధాలు కూడా అందిస్తుందని ఇజ్రాయెల్‌‌ మిలిటరీ పేర్కొంటుంది. తాజాగా ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గాజాలో, లెబనాన్‌లో చేసినట్లుగా, జోర్డాన్‌ను అస్థిరపరచడానికి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తూర్పు ఫ్రంట్‌ను స్థాపించడానికి ఇరాన్ కృషి చేస్తోందని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed