ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై 200కి పైగా రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా

by Harish |   ( Updated:2024-07-04 10:14:54.0  )
ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై 200కి పైగా రాకెట్లు ప్రయోగించిన హిజ్బుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లా గ్రూప్, గురువారం ఇజ్రాయెల్ సైనిక స్థావరాలపై 200కి పైగా రాకెట్లు ప్రయోగించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. తమ సీనియర్ కమాండర్‌లలో ఒకరిని చంపినందుకు ప్రతీకార చర్యగా ఈ దాడులు చేసినట్లు హిజ్బుల్లా గ్రూప్ పేర్కొంది. బుధవారం ఇజ్రాయెల్ దళాలు దక్షిణ లెబనాన్‌లోని టైర్ ప్రాంతంలో దాడి చేసి మొహమ్మద్ నమెహ్ నాజర్‌ను చంపాయి. దీనికి ప్రతిస్పందనగా హిజ్బుల్లా, లెబనాన్‌‌కు సరిహద్దు వెంబడి ఉన్న ఐదు ఇజ్రాయెల్ స్థావరాలపై 200 కంటే ఎక్కువ భారీ వార్‌హెడ్‌లతో కటియుషా రాకెట్‌లు, ఫలక్ రాకెట్‌లను ప్రయోగించింది.

ఇరాన్‌కు మద్దతుగా హిజ్బుల్లా, ఇజ్రాయెల్‌పైకి గురువారం నాడు చేసిన దాడి ఇటీవల నెలల్లో అతిపెద్దదని గ్రూప్ సభ్యులు పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన ఇజ్రాయెల్, అనేక అనుమానాస్పద రాకెట్లు తమ భూభాగంలోకి ప్రవేశించాయని, వాటిలో చాలా వరకు అడ్డుకున్నామని తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టం గురించిన వివరాలు మాత్రం అందించలేదు. అక్టోబరు 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో గాజాలో యుద్ధం మొదలుకాగా, అప్పటి నుంచి హమాస్‌కు మద్దతుగా ఇరాన్‌కు సన్నిహితంగా ఉండే హిజ్బుల్లా గ్రూప్ ఇజ్రాయెల్‌పై దాడి చేస్తూనే ఉంది.

Advertisement

Next Story