ఇంధన కేంద్రాలే టార్గెట్: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా

by Dishanational2 |
ఇంధన కేంద్రాలే టార్గెట్: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. తాజాగా ఉక్రెయిన్‌లోని ఇంధన కేంద్రాలే లక్ష్యంగా రష్యా విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో సుమారు 50క్షిపణులు, 20డ్రోన్‌లు ఉపయోగించినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ వెల్లడించారు. రష్యా జరిపిన వైమానిక దాడిలో మూడు థర్మల్ పవర్ ప్లాంట్‌లలో తీవ్రమైన పరికరాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఖేర్సన్ నగరంలోని రైల్వే స్టేషన్ ట్రాక్‌లు ధ్వంసమయ్యాయని, రాజధాని కీవ్‌కు ఆనుకుని ఉన్న బ్రోవరీలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ‘ఈ ఘర్షణను ప్రపంచం మొత్తం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. నాజీయిజానికి మరో అవకాశం ఇచ్చే హక్కు ప్రపంచం మొత్తానికి లేదు’ అని జెలెన్ స్కీ పేర్కొన్నారు. నేషనల్ ఎలక్ట్రికల్ గ్రిడ్ ఆపరేటర్ ఉక్రెనెర్గో ఈ ఘటనలపై స్పందిస్తూ.. విన్నిట్సియా, జపోరిజ్జియా, కిరోవోహ్రాడ్, పోల్టావా, ఇవానో-ఫ్రాంకివ్స్క్ ప్రాంతాల్లో ఇంధన సౌకర్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. కాగా, ఏప్రిల్ 27న కూడా ఇంధన మౌలిక సదుపాయాలపై భారీ వైమానిక దాడి జరిగింది. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా తరచుగా వైమానిక దాడులతో విద్యుత్, ఇంధన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది.

Next Story