టిబెట్ ప్రజల హక్కులకు మద్దతు ఇచ్చే చట్టంపై సంతకం చేసిన బైడెన్

by Harish |
టిబెట్ ప్రజల హక్కులకు మద్దతు ఇచ్చే చట్టంపై సంతకం చేసిన బైడెన్
X

దిశ, నేషనల్ బ్యూరో: టిబెట్‌పై చైనా ఆక్రమణలు కొనసాగుతున్న నేపథ్యంలో తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ టిబెట్ ప్రజల హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛకు మద్దతు ఇచ్చే చట్టంపై సంతకం చేశారు. చైనా-టిబెట్ మధ్య సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, ఎలాంటి అణచివేత ధోరణి లేకుండా అంతర్జాతీయ చట్టాల ప్రకారం, విభేదాలను పరిష్కరించుకోవాలని పేర్కొంటూ, "ది రిసోల్వ్ టిబెట్ చట్టం"పై జో బైడెన్ శనివారం సంతకం చేశారు.

ఈ చట్టం టిబెట్-చైనా వివాదానికి పరిష్కారాన్ని ప్రోత్సహించడం కోసం ఉద్దేశించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు సంతకం చేయడం ద్వారా టిబెట్ సమస్య పరిష్కారానికి చైనాపై మరింత ఒత్తిడి పెంచినట్లయింది. ముందస్తు షరతులు లేకుండా, దలైలామా లేదా ఆయన ప్రతినిధులతో, టిబెట్‌పై సానుకూల చర్చల ఒప్పందానికి అమెరికా చైనాకు ఈ చట్టం ద్వారా పిలుపునిచ్చింది. అమెరికా అధ్యక్షుడు ఈ చట్టంపై సంతకం చేయడంపై స్పందించిన , టిబెట్ కోసం పోరాడుతున్న అంతర్జాతీయ ప్రచార ప్రెసిడెంట్ టెంచో గ్యాట్సో మాట్లాడుతూ, టిబెట్ ప్రజల పట్ల చైనా క్రూరంగా ప్రవర్తిస్తున్న తీరును రిసోల్వ్ టిబెట్ చట్టం దెబ్బతీస్తుందని అన్నారు. చైనా టిబెట్ ప్రజల హక్కులను హరించాలని చూస్తుంది. ఇప్పుడు ఈ బిల్లు టిబెటన్లను వారి స్వంత మత, సాంస్కృతిక, భాషా, చారిత్రక గుర్తింపు కలిగిన వ్యక్తులుగా చూస్తుందని తెలిపారు.

ఎప్పటి నుంచో టిబెట్‌ గుర్తింపును దెబ్బతీసేందుకు చైనా ప్రయత్నిస్తోంది. టిబెటన్ ప్రజలకు నిజమైన స్వయం ప్రతిపత్తి కల్పించాలని చైనాకు వ్యతిరేకంగా దలైలామా చాలా కాలంగా పోరాడుతున్నారు. తాజాగా ది రిసోల్వ్ టిబెట్ చట్టంపై బైడెన్ సంతకం చేయడంతో చైనాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.



Next Story