Anura Dissanayake: శ్రీలంక అధ్యక్షుడిగా అనుర దిసనాయకే ప్రమాణం.. అభినందనలు తెలిపిన మోడీ

by vinod kumar |
Anura Dissanayake: శ్రీలంక అధ్యక్షుడిగా అనుర దిసనాయకే ప్రమాణం.. అభినందనలు తెలిపిన మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక ప్రెసిడెంట్ ఎన్నికల్లో విజయం సాధించిన అనుర దిసనాయకే సోమవారం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ రాజధాని కొలంబోలోని రాష్ట్రపతి సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీలంక చీఫ్ జస్టిస్ జయంత జయసూర్య ఆయనతో ప్రమాణం చేయించారు. దీంతో శ్రీలంక 9వ అధ్యక్షుడిగా దిసనాయకే బాధ్యతలు చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ)కి చెందిన దిసనాయకే తన సమీప ప్రత్యర్థి సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ)కి అభ్యర్థి సాజిత్ ప్రేమదాసపై గెలుపొందారు. దిసనాయకే ప్రమాణ స్వీకారానికి ముందు శ్రీలంక ప్రధాన మంత్రి దినేష్ గుణవర్దన తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

దిసనాయక నేపథ్యమిదే

1968 నవంబర్ 24న శ్రీలంకలోని ఉత్తర మధ్య ప్రావిన్స్‌ అనురాధపుర జిల్లాలోని తంబుతేగామా గ్రామంలో జన్మించిన దిసనాయకే.. కొలంబోలోని కెలానియా విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1987లో జనతా విముక్తి పెరమున(జేవీపీ)లో చేరి రాజకీయాల్లో అడుగుపెట్టారు. అంతకుముందు విద్యార్థి సంఘాల్లోనూ క్రియాశీలకంగా పని చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పని చేసిన ఆయన రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో ఎన్‌పీపీ తరఫున అధ్యక్ష రేసులో నిలిచారు. అప్పుడు కేవలం 3శాతం ఓట్లు మాత్రమే సాధించారు. తాజాగా 2024లోనూ అధ్యక్షుడిగా పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2019లో జేవీపీ పేరు ఎన్‌పీపీగా మార్చారు.

అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ

శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన దిసనాయకేకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రీలంక ప్రెసిడెంట్ ఎలక్షన్స్‌లో విజయం సాధించిన అనుర దిసనాయకేకు అభినందనలు. భారత్, శ్రీలంకల మధ్య ప్రత్యేక సంబంధాలున్నాయి. దేశ ప్రజల ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి వెంటనే దిసనాయకే రిప్లై ఇచ్చారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు తనకు శుభాకాంక్షలు తెలిపిన మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

Next Story

Most Viewed