నేనంటే నేనే.. టీఆర్ఎస్ అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ

by Shyam |
Bayyaram
X

దిశ, బయ్యారం: టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పదవికి మండలంలో తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాలో ఎక్కడా లేనంతగా బయ్యారం మండలంలో తగ్గపోరు నడుస్తోంది. ముఖ్యంగా నలుగురు నాయకుల మధ్య ఈ పోటీ తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఆ నాయకులు ఎమ్మెల్యే వద్ద తమ లాబీయింగ్ జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే అధ్యక్ష పదవి ఎంపిక ఎమ్మెల్యే చేయనున్న నేపథ్యంలో ఆమె ఆశీస్సులు ఎవరికి ఉంటాయోనని మండల ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఎవరి బలం ఎంత..?

టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్ష పీఠం కోసం బయ్యారం గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు తిరుమల ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ తాత గణేష్, సొసైటీ చైర్మన్ మూల మధూకర్ రెడ్డి, బత్తిని రాంమూర్తి పోటీ పడుతున్నారు. కాగా, ఈ నలుగురిలో సొసైటీ చైర్మన్ మూల మధూకర్ రెడ్డి 2016 సంవత్సరంలో మండల అధ్యక్షుడిగా సేవలు అందించిన అనుభవం ఉంది. దీంతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందుతో సత్ససంబంధాలు కలిగి ఉండటం ఆయనకు కలిసి వచ్చేలా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

బాలాజీపేట పంచాయతీకి చెందిన బత్తిని రాంమూర్తికి పార్టీ గ్రామ శాఖ పూర్తి మద్దతు ఇస్తోంది. ఆయనకు యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఈ కారణాలతోనైనా ఆయనకు అధ్యక్ష పదవి ఇవ్వాలని మెజార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశ పడుతున్నారు. మరో నాయకుడు తాత గణేష్ మండల వైస్ ఎంపీపీగా కొనసాగుతున్నారు. మండలంలో అన్ని వర్గాల ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తుండటంతో ఆయనకు మండలంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈయనను కూడా అధ్యక్షుడిని ఇస్తే బాగుంటుందని పార్టీలోని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ముగ్గురు నాయకులతోపాటు తిరుమల ప్రభాకర్ రెడ్డి పేరు సైతం గట్టిగా వినిపిస్తోంది. ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేకు అనుకూలంగా ఉండటం, ఇప్పటి వరకు ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాకపోవడం ప్లస్ పాయంట్ అని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. అలాగే పార్టీ కార్యకర్తల వెన్నంటి ఉండి పని చేస్తాడనే అభిప్రాయం ఎమ్మెల్యేకు ఉన్నట్లు చెబుతున్నారు. ఆయన కలుపుగోలుపు తనం, అందరిని సమన్వయ పరిచేతత్వం ఉన్నదని పార్టీలోని అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలు ఆయన పట్ల సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.

అయితే ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాత్రం.. అధ్యక్ష పదవిని కొత్త వారికి కట్ట బెడితే పాత, కొత్త తేడా లేకుండా పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తారన్న ఆలోచనలో ఉన్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. కాగా వీరిలో ఎక్కువ అవకాశాలు తిరుమల ప్రభాకర్ రెడ్డికే ఉన్నట్లు మండల నాయకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ పరిశీలనలోనూ ఆయన పేరే ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ నలుగురిలో ఎమ్మెల్యే ఎవరి వైపు మొగ్గు చూపుతుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే..!

Advertisement

Next Story

Most Viewed