దీపావళి ఎప్పుడు..? అక్టోబర్ 31..? లేదా నవంబర్ 1?.. గందరగోళంలో ప్రజలు

by karthikeya |   ( Updated:2024-10-17 06:17:18.0  )
దీపావళి ఎప్పుడు..? అక్టోబర్ 31..? లేదా నవంబర్ 1?.. గందరగోళంలో ప్రజలు
X

దిశ, వెబ్‌డెస్క్: చీకట్లను పారద్రోలుతూ అందరి జీవితాల్లో వెలుగు నింపే పండుగ దీపావళి పండుగ. మరి అలాంటి దీపావళి పండుగను 31వ తేదీన జరుపుకోవాలని కొందరు పండితులు సూచిస్తుంటే.. కాదు నవంబర్ 1న పండుగ జరుపుకోవడమే శుభప్రదం అంటున్నారు ఇంకొంతమంది పండితులు. ఇప్పుడీ వైరుధ్య అభిప్రాయాల వల్ల మళ్లీ దీపావళి వార్తల్లో నిలిచింది.

హిందువులు ప్రతి ఏటా భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో దీపావళి వేడుకలు గ్రాండ్‌గా నిర్వహిస్తారు. ఈ పండుగను ప్రతి ఏటా అశ్వయుజ మాసంలో అమావాస్య తిథినాడు వైభవంగా జరుపుకుంటారు. పండుగ సందర్భంగా గణేశుడు, సరస్వతీదేవి, కుబేరులతో పాటు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో ప్రత్యేకంగా పూజిస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకాన్ని సందర్శిస్తుందని, ఆ సమయంలో శోభాయమానంగా పూజార్చనలు జరుగుతూ శుభప్రదంగా ఉన్న ఇంట్లోకి ఆమె ప్రవేశిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అయితే ఈ సారి పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో గందరగోళం నెలకొంది.

దీపావళిని అమావాస్య తిథి అయిన అక్టోబర్ 31న వచ్చిందా..? లేదంటే నవంబర్ 1న వచ్చిందా? అనేది అందరినీ డైలమాలో పడేసింది. ప్రదోష అమావాస్య అక్టోబర్ 31, నవంబర్ 1.. రెండు తేదీల్లో వస్తోంది. దీంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. వేద క్యాలెండర్ ప్రకారం అమావాస్య తిథి, అక్టోబర్ 31న మధ్యాహ్నం 3:12 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5:14 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత పాడ్యమి ప్రారంభమవుతుంది. దీపావళి రోజున సాధారణంగా లక్ష్మీ పూజ అమావాస్య తిథి, ప్రదోష కాలాల్లో సూర్యాస్తమయం నుంచి అర్థరాత్రి వరకు జరుగుతుంది. ఈ లెక్క ప్రకారం అమావాస్య తిథి, ప్రదోష కాలం, శుభ సమయాలూ అన్నీ కలిసొచ్చిన అక్టోబర్ 31నే దీపావళి జరుపుకోవాలని కొందరు పండితులు సూచిస్తున్నారు.

అక్టోబర్ 31న దీపావళి జరుపుకోవాలని సూచిస్తున్న పండితులపై కొంతమంది పంచాంగకర్తలు మాత్రం మండిపడుతున్నారు. ద్రుక్ సిద్ధాంత పంచాంగం ప్రకారం.. నవంబర్ 1నే దీపావళి జరుపుకోవాలని సూచిస్తున్నారు. శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి సూర్యోదయ సమయంలో మాత్రమే వస్తుందని, అందువల్ల అమావాస్య తిథిలో ఉదయం ఉన్న నవంబర్ 1నే పండుగను జరుపుకోవాలని పంచాంగకర్తలు వాదిస్తున్నారు. పూర్వ పద్ధతి అని కొంతమంది అయోమయానికి గురి చేయడం సరి కాదన్నారు. టీటీడీ, శ్రీశైలం దేవస్థానాల విధానాలను అనుసరించి ప్రభుత్వం అక్టోబర్ 31న దీపావళి సెలవు ప్రకటించడాన్ని కూడా తప్పుబట్టారు. ఏది ఏమైనా దీపావళితో పాటు హిందువుల పండుగలైన సంక్రాంతి, భోగి, శివరాత్రి, ఉగాది పండుగల నేపథ్యంలో అప్పుడప్పుడూ ఇలాంటి వైరుధ్యాలు సహజంగానే తలెత్తుతూ ఉంటాయి. అయితే దీనిపై ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed