నెత్తురోడిన జాతీయ రహదారి.. రాంగ్ రూట్‌లో ట్రాక్టర్ డ్రైవర్..

by Sumithra |
నెత్తురోడిన జాతీయ రహదారి.. రాంగ్ రూట్‌లో ట్రాక్టర్ డ్రైవర్..
X

దిశ, నార్కట్ పల్లి: చిట్యాల పట్టణ శివారులోని ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం, ఆరుట్ల రామాపురం కొట్టాల గ్రామానికి చెందిన వడిత్య సాయి గణేష్ (19) హైదరాబాదులోని తన మేనమామ వద్ద ఉంటూ జేసీబీ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఎల్బీనగర్ లోని వాహిని నగర్ లో ఉంటున్న తన స్నేహితుడు రాజుల తన్మయ్ తో కలిసి వ్యక్తిగత పని నిమిత్తం ద్విచక్ర వాహనం పై నల్లగొండ కు బయల్దేరారు.

ఈ క్రమంలో చిట్యాల పట్టణం దాటాక ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద వట్టిమర్తి నుండి చిట్యాలకు రాంగ్ రూట్ లో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ అజాగ్రత్తగా నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. దాంతో తీవ్రంగా గాయపడిన సాయి గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన రాజుల తన్మయ్ (19) ని చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లిలోని కామినేని వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు. మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు.

Next Story

Most Viewed