తుమ్మల కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్..? ఆ రోజే హస్తం గూటికి..!

by Javid Pasha |
తుమ్మల కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఫిక్స్..?  ఆ రోజే హస్తం గూటికి..!
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరే దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం తుమ్మలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు పలువురు అగ్రనేతలు కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరాలని ఆయనను ఆహ్వానించారు. దీంతో పార్టీ మారడంపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని హస్తం నేతలకు తుమ్మల చెప్పినట్లు తెలుస్తోంది. పాలేరు బీఆర్ఎస్ టికెట్‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికే సీఎం కేసీఆర్ కేటాయించారు. దీంతో తనకు టికెట్ దక్కకపోవడంతో తుమ్మల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీలోకి దిగాలని తుమ్మల భావిస్తున్నారు. దీంతో పాలేరు నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆహ్వానం రావడంతో తుమ్మల హస్తం గూటికి చేరడం దాదాపు ఖాయమైందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ నెల 6న ఢిల్లీ వేదికగా తుమ్మల హస్తం గూటికి చేరనున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తుమ్మలకు అనుచరగణం ఉంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. కమ్మ సామాజికవర్గంలో ఆయనకు పట్టు ఉండటం కూడ పార్టీకి కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.

తుమ్మలకు బుజ్జగింపులు

బీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న తుమ్మలను బుజ్జగించేందుకు గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్‌లో తుమ్మలను కలిపి శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు. కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్న తుమ్మలతో బీఆర్ఎస్ జరిపిన చర్చలు ఫలించలేదు. తనకు టికెట్ కావాలని, పార్టీలో ఎలాంటి పదవులు వద్దని పార్టీ నేతలకు ఆయన చెప్పారు. దీంతో తుమ్మల త్వరలో కాంగ్రెస్‌లో చేరిక లాంఛనమేనని అంటున్నారు.

రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం

తుమ్మల, రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో కలిసి పనిచేశారు. ఇద్దరూ అప్పట్లో టీడీపీలో కీలక నేతలుగా ఉన్నారు. అప్పటినుంచి ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి. ఆ స్నేహపూర్వక సంబంధాల క్రమంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు తుమ్మల కూడా ఆసక్తి చూపుతున్నారు. బీఆర్ఎస్‌లో టికెట్ దక్కకపోవడంతో తుమ్మల అనుచరులు కూడా కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ బలంగా లేకపోవడం, వర్గాలుగా చీలిపోయి ఎవరికి వారు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌లో చేరితే ప్రాధాన్యత ఉంటుందని తుమ్మల భావిస్తున్నారు.

Next Story

Most Viewed