చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకో : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకో : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : అమలు చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకని..? ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లుంది కాంగ్రెస్ పాలన అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్​ వేదికగా స్పందించారు. అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకిస్తున్నారు ఇప్పుడని.. రైతు భరోసా, రుణమాఫీ పై ఎన్నికల వేళ బీరాలు పలికిన ముఖ్యమంత్రి ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాడని కేటీఆర్ విమర్శలు చేశారు.

తాజాగా రైతు భరోసాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఢిల్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతన్నలను అయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వలేమని కుండా బద్దలు కొట్టాడని.. కౌలు రైతులను నమ్మించి తడి గుడ్డతో గొంతు కోసింది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. మొన్న రుణమాఫీ పేరిట మోసం చేశారని, నిన్న వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని.. నేడు కౌలు రైతుకు భరోసా ఇవ్వలేమని చేతులెత్తేస్తారా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో చెప్పిందేంటి..? చేస్తున్నదేంటి..? అని నిలదీశారు. 420 హామీల్లో ఒక్కో వాగ్దానాన్ని సీఎం పాతరేస్తున్నారని... చేతకానప్పుడు హామీలు ఇవ్వడమెందుకు..? అధికారంలోకి రాగానే మాటతప్పడమెందుకు..? ఇది ముమ్మాటికీ మోసం.. నయవంచన అని దుయ్యబట్టారు. తెలంగాణ రైతులు దేన్నైనా క్షమిస్తారు కాని..నమ్మించి ద్రోహం చేస్తే ఎట్టిపరిస్థితుల్లో క్షమించరని, గద్దెనెక్కాక గొంతుకోసిన వారిని అస్సలు వదిలిపెట్టరని, ఈ వెన్నుపోటుకు ముఖ్యమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed