ఊడుతున్న పెచ్చులు.. తలుపులు లేని గదులు.. అధ్వానంగా ప్రాథమిక పాఠశాలలు..

by Nagam Mallesh |
ఊడుతున్న పెచ్చులు.. తలుపులు లేని గదులు.. అధ్వానంగా ప్రాథమిక పాఠశాలలు..
X

దిశ, గూడూరు : అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా మండలంలోని అమ్మ ఆదర్శ పాఠశాలల పునర్నిర్మాణం కోసం రూ.30 లక్షలు కేటాయించారు. అధికారుల పర్యవేక్షణ లోపం ప్రధానోపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల ఈ నిర్మాణ పనులను తాత్కాలికంగా చేసి మధ్యలోనే వదిలివేశారు. కొంత మొత్తంలో బిల్లులను మంజూరు చేసి మిగతా నగదును ఆపడంతో ఇవి ముందుకు కదలట్లేదు. సంవత్సరాల క్రితం నిర్మించిన పాఠశాలల భవనాలలో పెచ్చులూడుతున్నాయి. పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులపై ఈ పెచ్చులు ఏ క్షణాన పడుతాయో అని టెన్షన్ పడుతున్నారు. తమ తలపై ఎప్పుడు పడుతుందో అనే భయం భయంతో విద్యను అభ్యసిస్తున్నారు. భవనాలకు తలుపులు లేక గదులు అన్ని తెరుచుకొని ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. ఉన్న ఆ తలుపులు ఏ క్షణాన కూలిపోతాయి అని ఆ తలుపులను ముట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. గూడూరు మండలంలోని గిరిజన తండాలలో ఉన్న ప్రాథమిక పాఠశాలలు అధ్వాన స్థితిలోకి చేరాయి. తమ పిల్లలను పాఠశాలలో చేర్పించి విద్యాబుద్ధులను నేర్పించాలని తల్లిదండ్రులు ఆశిస్తే వారి ఆశలు అడియాశలు అవుతున్నాయి. పాఠశాల నిర్మాణాలు సరిగా లేక పాఠశాలలో విద్యాబోధనలు చేసే ఉపాధ్యాయులు సరైన సమయంలో రాక పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారాయి. ఈ విధంగా మారడానికి ప్రధానంగా పాలకుల నిర్లక్ష్యమే నిలువెత్తు నిదర్శనం అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed