రుణాల పంపిణీ లక్ష్యం సాధించాలి

by Sridhar Babu |
రుణాల పంపిణీ లక్ష్యం సాధించాలి
X

దిశ, మహబూబాబాద్ టౌన్ : రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు బ్యాంకర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సూచించారు. పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. సమీకత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ మొదటి త్రైమాసిక సమావేశంను స్థానిక సంస్థలు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో, డేవిడ్ లతో కలిసి నిర్వహించారు. 24-25 ఏడాదికి సంబంధించి పంట రుణాలు, స్వయంసహాయక, ఎస్సీ, ఎస్టీ రుణాలు త్రైమాసికానికి రూ. 1000 కోట్లు కాగా రూ.1137 కోట్ల లక్ష్యాన్ని సాధించారని తెలిపారు. రుణమాఫీ ద్వారా అర్హులైన ప్రతి రైతు లబ్ధి పొందేలా చూడాలన్నారు.

వ్యవసాయ శాఖతో పాటు, పశుసంవర్థక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర శాఖలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించాలని కోరారు. రుణాలు తీసుకున్న వారు యూనిట్లు స్థాపించారా లేదా అన్నది పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. తదుపరి సమావేశం నాటికి పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని సూచించారు. వీధి వ్యాపారులకు ముద్ర రుణాలతో పాటు స్టాండ్ ఆఫ్​ ఇండియా కింద రుణాలు అందించాలన్నారు. ఈ సమావేశంలో దేబోజి బర్వన్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఆర్. సత్యనారాయణ మూర్తి, జీఎండీఐసీ సత్యనారాయణ, డీఆర్డీఓ మధుసూదన్ రాజు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed