‘మూసీ’పై విమర్శలు తిప్పికొట్టాలి.. కార్పొరేషన్ చైర్మన్‌లకు టీపీసీసీ చీఫ్ కీలక ఆదేశాలివే

by Ramesh N |
‘మూసీ’పై విమర్శలు తిప్పికొట్టాలి.. కార్పొరేషన్ చైర్మన్‌లకు టీపీసీసీ చీఫ్ కీలక ఆదేశాలివే
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎప్పటికప్పుడు ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టాలని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ కాంగ్రెస్ నేతలను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కార్పొరేషన్ చైర్మన్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశంలో మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంతో కష్టపడి అద్భుతంగా పనిచేశారని. నియంత పాలన చేసిన బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను గద్దె దించడంలో మీ పాత్ర ఉందన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మీరు కాస్త విశ్రాంతి తీసుకుంటున్నట్లు అనిపిస్తుందని చురకలంటించారు. 43 లక్షల క్రియాశీలక కార్యకర్తల్లో 40 మందికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవులు దక్కాయన్నారు. మీలో ఎంపీలు ఎమ్మెల్యేలు కావాల్సిన వారు ఉన్నారన్నారు. ప్రభుత్వం సోషల్, ప్రాంతీయ, సీనియారిటీ, హార్డ్ వర్క్ లాంటి వాటి ప్రాతిపదికన రాష్ట్ర చైర్మన్‌లు దక్కాయని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం, సీఎం, మంత్రులు 18 గంటల పాటు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారన్నారు. కానీ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం సోషల్ మీడియాలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రుల పట్ల ప్రజల్లో గందరగోళానికి దారితీస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచుకుని ప్రచారం చేయాలని, ఇంకా దూకుడుగా పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారని తెలిపారు. ఇప్పటి వరకు దేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. ఫ్రీ బస్, 200 యూనిట్ల కరెంట్, రూ. 500 గ్యాస్, రూ. 2 లక్షల రుణమాఫీ, 30 వేల ఉద్యోగాల కల్పన, కొత్తగా డీఎస్సీతో 11 వేల ఉద్యోగాలు, స్పోర్ట్స్ వర్సిటీ, స్కిల్ వర్సిటీ, రూ. 80 వేల కోట్ల పెట్టుబడులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు ఇచ్చామన్నారు. వాటన్నింటినీ మనం జనంలోకి బాగా తీసుకుపోవాలని ఆదేశించారు. అలాగే హైడ్రా, మూసి ప్రక్షాళన అంశాలలో బీఆర్ఎస్, బీజేపీ అనేక దుర్మార్గపు ప్రచారం చేస్తోందన్నారు. వీటన్నిటిని మనం మన ప్రచార వేదికల మీద పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. మన సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్‌లను బాగా వాడుకోవాలని, ప్రతి ఒక్కరు మీ సోషల్ మీడియా అన్ని రకాల ఫ్లాట్ ఫామ్‌లను ఉపయోగించి కాంగ్రెస్, ప్రభుత్వ అనుకూల ప్రచారం చేస్తూ, ప్రతిపక్ష పార్టీల వ్యతిరేక ప్రచారాలు తిప్పికొట్టాలని ఆదేశాలిచ్చారు.

Next Story