అమిత్ షాతో ముగిసిన టీ-బీజేపీ నేతల భేటీ.. చర్చించిన అంశాలు ఇవే!

by GSrikanth |
అమిత్ షాతో ముగిసిన టీ-బీజేపీ నేతల భేటీ.. చర్చించిన అంశాలు ఇవే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ నేతలతో అమిత్ షా, జేపీ నడ్డాల సమావేశం ముగిసింది. మంగళవారం ఢిల్లీలోని జేపీ నడ్డా నివాసంలో దాదాపు 3 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఈ మీటింగ్‌కు బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల, విజయశాంతి, డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గరికపాటి, వివేక్, జితేందర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ధర్మపురి అర్వింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అమిత్ షా, జేపీ నడ్డా కీలక దిశానిర్దేశం చేశారు.

బీజేపీ మిషన్ 90, ఎన్నికల ప్రణాళికపై ప్రధానంగా చర్చించారు. నేతలో చర్చ మధ్యలో అమిత్ షా, జేపీ నడ్డా విడిగా మాట్లాడుకోవడం ఆసక్తిగా మారింది. అనంతరం మళ్లీ వెళ్లి వారిద్దరు రాష్ట్ర నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం పొంగులేటి సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత అంశాలపై మాత్రమే చర్చించామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది చర్చించామన్నారు. ముఖ్యంగా 'హర్ ఘర్ కమల్' నినాదంతో పార్టీ ఎన్నికల గుర్తును ప్రతి ఇంటికి చేరువ చేసే దిశగా కార్యక్రమాలు ఉండాలని అధిష్టానం సూచించినట్లు చెప్పారు.

ఈ మీటింగ్‌లో రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. అలాగే ఢిల్లీ లిక్కర్ పాలసీపై చర్చించారా అని అడగ్గా చట్టం తన పని తాను చేసుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్పందిస్తూ బీజేపీ చాలా పెద్ద పార్టీ అని తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంపై చర్చించామన్నారు. ఈ మీటింగ్‌లో పూర్తిగా బీజేపీ సంస్థాగత అంశాలకే పరిమితం అయిందన్నారు.

Next Story

Most Viewed