TG Cabinet : పీసీసీ చీఫ్ నియామకం.. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..!

by Rajesh |
TG Cabinet : పీసీసీ చీఫ్ నియామకం.. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15 తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. కేబినెట్ విస్తరణతో పాటు పీసీసీ చీఫ్ నియామకం అప్పుడే ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ రాష్ట్ర పర్యటన సైతం అప్పుడే ఉండొచ్చని తెలుస్తున్నది. పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులూ అదే నెలలో భర్తీ చేసే చాన్స్ కనిపిస్తున్నది. ఆగస్టు 3వ తేదీ ఫారిన్ టూర్ వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అదే నెల 11వ తేదీ రాత్రి తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. సీఎం హోదాలో ఆయన తొలిసారిగా పంద్రాగస్టు సందర్భంగా జెండావిష్కరణ చేయనున్నారు. తర్వాత రోజు లేదా మర్నాడు ఢిల్లీకి వెళ్లి, పెండింగ్‌లో ఉన్న అంశాలపై అధిష్టానంతో మాట్లాడి వీటన్నింటిపైనా క్లియరెన్స్ తీసుకుంటారని తెలుస్తున్నది.

శ్రావణ మాసంలోనే కేబినెట్ విస్తరణ?

పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ శ్రావణ మాసంలో జరిగే అవకాశం ఉన్నదని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆగస్టు 5వ తేదీ నుంచి శ్రావణమాసం షురూ కానున్నది. అదే నెల 15వ తేదీ తర్వాతే కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఉండొచ్చని ఏఐసీసీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. వాస్తవానికి జూలై ఫస్ట్ వీక్‌లోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే ఎవరెవరిని తీసుకోవాలనే అంశంపై క్లారిటీ రాకపోవడంతో వాయిదా పడింది. కానీ ఈ సారి మాత్రం పంద్రాగస్టు తర్వాత మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందని ఏఐసీసీకి సన్నిహితంగా ఉన్న ఓ మంత్రి కామెంట్ చేశారు. అయితే ప్రస్తుతం సీఎంతో కలుపుకొని మొత్తం 12 మంది మంత్రులున్నారు. మరో ఆరుగురిని కేబినెట్‌లో తీసుకునే ఛాన్స్ ఉండగా నలుగురు లేదా ఐదుగురితో మంత్రి వర్గం విస్తరించాలని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలిసింది.

పీసీసీ చీఫ్ ఎన్నిక సైతం అప్పుడే..

కేబినెట్ విస్తరణ టైంలోనే పీసీసీ చీఫ్ నియామకం ఉండే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కని సామాజికవర్గ లీడర్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి, సామాజికంగా న్యాయం పాటించామనే సంకేతాలు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. అలాగే డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీలో చీఫ్ విప్ పదవులు సైతం భర్తీ చేసే అవకాశం ఉన్నది. ఈ రెండూ కేబినెట్ ర్యాంక్‌తో సమానమైన పదవులు కావడంతో మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేలకు ఈ పోస్టులు ఇచ్చి సంతృప్తి పరచాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నది.

పంద్రాగస్టు తర్వాతే రాహుల్ సభ

రూ.2 లక్షల రుణమాఫీ అమలు చేస్తున్న సందర్భంగా ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీని పిలిచి వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తున్నది. ముందుగా ఈ నెల చివరన పబ్లిక్ మీటింగ్ నిర్వహించాలని పార్టీ నేతలు భావించారు. కానీ లోకసభ సమావేశాల్లో రాహుల్ బిజీగా ఉండటం, రాష్ట్రంలో వరుసగా వర్షాలు కురుస్తున్నందున దాన్ని వాయిదా వేసుకొని ఆగస్టు 15 తర్వాత నిర్వహించాలని పీసీసీ భావిస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన తర్వాత ఢిల్లీకి వెళ్లి రాహుల్ టూర్ డేట్ ఫిక్స్ చేస్తారని తెలుస్తున్నది.

కీలక నిర్ణయాలు అప్పుడే?

శ్రావణమాసం ఆగస్టు 5న ప్రారంభమై సెప్టెంబర్ 2వ తేదీ వరకూ ఉంటుంది. ఈ మాసంలోనే పార్టీ, ప్రభుత్వంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని పీసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. కేబినెట్ విస్తరణ, పీసీసీ నియామకంతో పాటు మరికొన్ని నామినేటెడ్ పదవులు సైతం భర్తీ చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసింది. కానీ న్యాయపరంగా చిక్కులు రావడంతో ఆ ఫైల్ రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నది. శ్రావణ మాసంలో గవర్నర్ ఆ రెండు ఎమ్మెల్సీ పదవుల ఎంపిక పూర్తి చేస్తారనే ప్రచారం ఉన్నది. ఇటీవలే 37 నామినేటెడ్ పోస్టులు ఫిలప్ చేసిన కాంగ్రెస్ మిగతావి సైతం శ్రావణ మాసంలో భర్తీ చేస్తుందని తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed