ప్రవళిక సూసైడ్ కేసులో సంచలన పరిణామం.. కోర్టులో లొంగిపోయిన శివరాం రాథోడ్..!

by Satheesh |
ప్రవళిక సూసైడ్ కేసులో సంచలన పరిణామం.. కోర్టులో లొంగిపోయిన శివరాం రాథోడ్..!
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: సంచలనం సృష్టించిన ప్రవళిక ఆత్మహత్య కేసు ఇంకో మలుపు తిరిగింది. ఈ కేసులో పోలీసులు నిందితునిగా పేర్కొన్న శివరాం రాథోడ్ శుక్రవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. తన కొడుకును ఈ కేసులో అన్యాయంగా ఇరికించారంటూ శివరాం రాథోడ్ తండ్రి నేనావత్ కిషన్ రాథోడ్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేసిన 24గంటలలోపే ఈ పరిణామం జరగటం గమనార్హం. ఈ నెల 13న ప్రవళిక అశోక్ నగర్లోని బృందావన్ హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడటం వల్లనే ఆమె ప్రాణాలు తీసుకుందని పెద్ద సంఖ్యలో విద్యార్థులు అదే రోజు రాత్రి ఆందోళన జరిపారు.

అయితే, ఆ మరుసటి రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రేమ వ్యవహారం ప్రవళిక ఆత్మహత్యకు కారణమని చెప్పారు. శివరాం రాథోడ్ మోసం చెయ్యటం వల్లనే ఆమె ప్రాణాలు తీసుకుందని చెప్పారు. ఈ క్రమంలో శివరాం రాథోడ్‌పై ఐపీసీ 420, 417, 306 సెక్షన్ల ప్రకారం చిక్కడపల్లి పోలీసులు కేసులు నమోదు చేసారు. శివరాం రాథోడ్ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో శివరాం రాథోడ్ శుక్రవారం నాంపల్లిలోని 9వ మెట్రోపాలిటన్ కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి కోర్టు ఒప్పుకోవటంతో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయాడు.



Next Story