కేసీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. కేసు తప్పదా?

by GSrikanth |
కేసీఆర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. కేసు తప్పదా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ సీఎం కేసీఆర్ కు ఉచ్చు బిగుసుకుంటోందా? మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయిన ఘటనలో విజిలెన్స్ నివేదికతో గులాబీ బాస్ కు సమస్యలు తప్పవా? రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది. మేడిగడ్డ ఘటనపై రేవంత్ రెడ్డి సర్కార్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు ఆదేశించగా విజిలెన్స్ అధికారులు తమ దర్యాప్తులో సంచలన విషయాలు గుర్తించినట్లు తెలుస్తోంది. త్వరలోనే విజిలెన్స్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుందని ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే కాళేశ్వరం ప్రాజెక్టు తన మానస పుత్రిక అని చెప్పుకున్న కేసీఆర్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.

కేసీఆర్ పై కేసు!:

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేడిగడ్డ పిల్లర్ల కుంగిపోయిన ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ కోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టుకు లేఖను సైతం రాసింది. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు ఆదేశించగా దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్.. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్లు తేల్చిందని. దాదాపు 3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృథా చేశారని ఈ బ్యారేజీ నిర్మాణంలో సంబంధం ఉన్న వారందరూ ఇందులో దోషులే అని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో వారంలో రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తున్నట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎఫ్ఐఆర్ కు సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే జరిగితే అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ ను సైతం ఇందులో భాద్యుడిగా చేసి కేసు నమోదు చేసే అవకాశం ఉందని దీంతో గులాబీ బాస్ కు మరిన్ని చిక్కులు తప్పవనే చర్చ తెరమీదకు వస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్:

కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని శాఖలపై పట్టు సాధిస్తూ ఇప్పుడిప్పుడే పరిపాలనలో స్పీడ్ పెంచుతోంది. ఈ క్రమంలో పాలన పగ్గాలు చేపట్టి రెండు నెలలు కూడా గడవక ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎటాక్ ప్రారంభిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ హామీల అమలు పేరుతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలే చేస్తోంది. దీంతో బీఆర్ఎస్ దూకుడుకు కళ్లెం వేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కాళేశ్వరం అవినీతిపై ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలు విచారణ కోసం ప్రభుత్వంపై సవాళ్లు చేస్తున్నాయి. దీంతో మేడిగడ్డ వ్యవహారంలో కేసీఆర్ కు ఉచ్చుబింగించడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలకు చెక్ పెట్టవచ్చనే భావనతో అధికార పక్షం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మేడిగడ్డ ఘటనపై త్వరలో ఎఫ్ఐఆర్ నమోదు కాబోతున్నదని కాంగ్రెస్ మద్దతు దారులు సోషల్ మీడియాలో పోస్టులు చేయడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. అయితే కేసీఆర్ అరెస్ట్ సైతం జరుగుతుందా అనే ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయి సతమతం అవుతున్న గులాబీ పార్టీకి కేసీఆర్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలకు వెళ్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదనే టాక్ వినిపిస్తోంది.

Next Story

Most Viewed