CM Revanth Reddy : రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటా

by Sridhar Babu |
CM Revanth Reddy : రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటా
X

దిశ, గండిపేట్ : రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక శాఖలో 483 మంది ఫైర్‌మెన్ అభ్యర్థులకు ఇవాళ శిక్షణ పూర్తి అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ ఫైర్ మెన్ అభ్యర్థుల పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారన్నారు. ఏ ఆకాంక్షతో యువత తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారో.. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేశామన్నారు. సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో

ముందుకు వచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నానని రేవంత్ అన్నారు. తమ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతోందన్నారు. అందులో భాగంగానే విద్య, వైద్యం, ఇరిగేషన్ కోసం ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతం ఎపుడు వస్తుందో తెలియకపోయేదని, ఇప్పుడు ప్రతి నెలా ఒకటో తారీఖునే ఉద్యోగులకు జీతం ఇస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం అందించి ప్రభుత్వం పై విశ్వాసం కల్పించామని తెలిపారు. 90 రోజుల్లో మరో 30 వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే 60 వేలకు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను

భర్తీ చేస్తూ ముందుకెళతామన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఒక సూచన చేశారు. వారికి ఏవైనా సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించాలని రేవంత్ తెలిపారు. మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇక్కడ ఏ విపత్తు జరిగినా ఫైర్ సిబ్బంది ముందుండేది అని పేర్కొన్నారు. కొలువుల కోసం నిరుద్యోగులు ఆందోళన చేయాల్సిన అవసరం లేదన్నారు. ఏ ఇబ్బంది ఉన్నా..మంత్రులు, ఉన్నతాధికారులను ఎప్పుడైనా కలవొచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్, అగ్నిమాపక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed