కలెక్టర్ సారు పేద రైతులకు న్యాయం ఏది

by Sumithra |
కలెక్టర్ సారు పేద రైతులకు న్యాయం ఏది
X

దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలానికి చెందిన చీపునుంతల గ్రామ శివారులోని సర్వే నెంబర్ 22లో 32 ఎకరాల భూమి లీజుల పేరుతో, బడా పారిశ్రామికవేత్తల కబంధ హస్తాల్లో ఉంది. గత రెండున్నర దశాబ్దాలకు పైగా తమకు న్యాయంచేయాలని బాధిత ఎస్సీ, బీసీ రైతులు సుమారు మూడు దశాబ్దాల నుండి పోరాటం చేస్తున్నా న్యాయం మాత్రం జరగడం లేదు. మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్డు సమీపంలో జూన్ రెండవ తేదీ నుండి జూలై ఆరవ తేదీ వరకు 34 రోజుల పాటు రైతులు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నరు. రైతుల దీక్షలకు మద్దతుగా సబ్బండ వర్గాల నేతలు, ఒక దశలో అధికార పార్టీ నేతలు మినహా, మిగతా పార్టీల నేతలు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ యువజన సంఘాల నేతలు మొత్తం ఏకమై రైతులకు పెద్ద మొత్తంలో మద్దతు తెలిపారు.

చివరకు జిల్లా కలెక్టర్ అమాయ్ కుమార్ ఆదేశాల మేరకు జూలై ఆరవ తేదీన స్థానిక తహసిల్దార్ కృష్ణ, అప్పుడ విధుల్లో ఉన్న ఎస్సై వరప్రసాదులు దీక్ష కేంద్రానికి చేరుకొని రైతులకు నచ్చచెప్పి నెల రోజుల్లో మీ భూ సమస్య పరిష్కరిస్తామని, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో రైతులు చేపట్టిన దీక్షను విరమించారు. అనంతరం అదే నెల 29వ తేదీన చీపునుంతల శివారులోని మైనింగ్ భూమి గురించి జిల్లా మైనింగ్, ఫారెస్ట్ అధికారులతో పాటు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా అభిప్రాయ సేకరణలో అధికారులు రైతులను డైలమాలో పెట్టి కేవలం ఇది ప్రజాభిప్రాయ సేకరణ మాత్రమేనని పదేపదే చెప్తూ రైతుల నుండి వెల్లువెత్తుతున్న నిరసనను బయటికి పోకుండా సమావేశాన్ని పోలీస్ వలయంలో నిర్వహించారు.

మీకు రావాల్సిన భూములను నెల రోజుల్లో మళ్లీ ఇప్పించి న్యాయం చేస్తామని అక్కడి నుంచి అధికారులు మాటలు చెప్పి చల్లగా జారుకున్నారు. రైతులు చేపట్టిన దీక్షను విరమింప చేసి ఇప్పటికి మూడు నెలలు గడిచిపోయినా న్యాయం మాత్రం జరగడంలేదని రైతులు ఆవేదనకు గురవుతున్నారు. 1975- 76 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ హయాంలో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం అసైన్డ్, లావని భూములను పట్టాల కింద అందించారని, అలా అందించిన భూములను మళ్లీ రైతుల వద్ద నుండి లాక్కొని ఇప్పటికీ 26 సంవత్సరాలు గడుస్తున్నా తిరిగి వారి భూములు వారికి ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు ఎందుకు రావడం లేదని బాధిత నిరుపేద రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కనీసం తమ నుంచి లాక్కున్న భూములకు పట్టా సర్టిఫికెట్లు ఇప్పిస్తే తాము కేసీఆర్ ప్రభుత్వం అందించే రైతుబంధు, రైతు బీమా, లాంటి ప్రయోజనాలు పొందుతామని వేడుకుంటున్నారు.

ఈ మైనింగ్ పక్కనే ఆనుకొని 950 ఎకరాల ఫారెస్ట్ స్టాండ్ ఉన్న అధికారులు మాత్రం మైనింగ్ మాఫియా ఇచ్చే లంచాలకు కక్కుర్తి పడుతున్నారు. వన్య ప్రాణుల మనుగడకే ప్రమాదం వాటిల్లుతున్నా తమకేం పోయిందిలే అని, ఇప్పుడు తాము ఇచ్చినవి కావు కదా సుమారు మూడు దశాబ్దాల కింద ఇచ్చిన వాటిని తాము ఏమి చేయలేమని కుంటి సాకులు చెప్పుకుంటూ మైనింగ్ కు అనుమతులు మంజూరు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గతంలో ఈ మైనింగ్ ను నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారని హైకోర్టు సైతం మొట్టికాయలు వేసి, జరుమానాల కూడా విధించారు.

ఈ మైనింగ్ పక్కనే ఆనుకొని అమ్రాయి చెరువు కూడా ఉందని, మైనింగ్ పక్కనే ఎన్నో కుటుంబాలు పాడి పరిశ్రమను నమ్ముకుని ఎంతోమంది రైతులు జీవిస్తున్నారని అన్నారు. గతంలోని ఈ చెరువులో చేపలు కూడా పెద్ద మొత్తంలో మృత్యువాత పడినా అధికారులు మాత్రం నిమ్మకు లేత్తినట్లు వ్యవహరిస్తూ అక్రమ మైనింగ్ కు వత్తాసు పలుకుతున్నారన్నారు. రైతులకు ఇచ్చిన హామీని మర్చిపోతున్నారని, బాధిత రైతులకు న్యాయం జరగకపోతే చివరకు చావులే శరణమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, కలెక్టర్ స్పందించి పేద రైతులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ప్రభుత్వానికి నివేదిక పంపించాను..

తలకొండపల్లి ఎక్స్ రోడ్డు సమీపంలో 34 రోజుల పాటు రైతులు చేపట్టిన దీక్షను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు విరమింప చేసిన మాట వాస్తవమేనని తలకొండపల్లి తాసిల్దార్ కృష్ణ తెలిపారు. ఆ మైనింగ్ కు పర్మిషన్ లేదని, ప్రస్తుతం మైనింగ్ బందు ఉందని, చీపునుంతల రైతుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు పూర్తి నివేదిక కలెక్టర్ కు అందజేసినట్లు తలకొండపల్లి తాసిల్దార్ కృష్ణ దిశతో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed