MP : మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది

by Kalyani |
MP : మూసీ బాధితులకు బీజేపీ అండగా ఉంటుంది
X

దిశ, శంషాబాద్ : మూసీ బాధితులకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ డివిజన్లోని భరత్ నగర్ కాలనీలో మూసి రివర్ బెడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇండ్ల బాధితులను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పర్యటించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో పేద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న పేదలకు ఎలాంటి భరోసా కల్పించకుండా ఖాళీ చేయిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. వారికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందన్నారు. మూసీ రివర్ ప్రాంతంలో ఉంటున్న వారిని ఖాళీ చేయించాలంటే ప్రభుత్వ వ్యాల్యూ ప్రకారం మూడు రెట్లు ఎక్కువ నష్టపరిహారం చెల్లించాలన్నారు.

ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వమే మూసి రివర్ బెడ్ ప్రాంతంలో ఉన్న ఇండ్లను కూల్చేందుకు పదివేల కోట్లు కేటాయించింది అని గుర్తు చేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఇప్పటి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. హైడ్రా ఒకవేళ మూసి రివర్ ప్రాంతంలో ఉన్న పేదవారి ఇండ్లను కూలుస్తామంటే లక్ష మందితో ఆందోళన చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ మల్లారెడ్డి, రాజేంద్రనగర్ నియోజకవర్గం కన్వీనర్ మల్లేష్ యాదవ్, నాయకులు కొమురయ్య, శ్రీధర్, వేణుగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed