తొమ్మిది నెలలైనా నో ప్రొగ్రెస్! పాలమూరు ప్రాజెక్టుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

by Geesa Chandu |
తొమ్మిది నెలలైనా నో ప్రొగ్రెస్! పాలమూరు ప్రాజెక్టుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 నెలలు అయినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చేపట్టడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నా ఒక్కసారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదన్నారు. సాగునీటి శాఖ మంత్రి ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని ఆరోపించారు. ఈ ఏడాది జూరాలకు భారీ వరద వచ్చిందని, అత్యధికంగా 3.88 లక్షల ఇన్ ఫ్లో రాగా, 50 రోజులలో 732 టీఎంసీల వరద వచ్చిందని తెలిపారు. ఇక్కడ ఒడిసిపట్టింది మాత్రం 22 టీఎంసీలు మాత్రమేనని, శ్రీశైలం, సాగర్ తర్వాత మిగతావన్నీ సముద్రం పాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల కింద నిర్మించాల్సిన రిజర్వాయర్లను ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టారని మండిపడ్డారు. 3.50 లక్షల ఆయకట్టుకు కేవలం 3.90 టీఎంసీల ఎల్లూరు, జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్లను మాత్రమే నిర్మించారని, అప్పటికే ఉన్న సింగోటం చెరువును దీనికోసం వినియోగిస్తున్నారన్నారు. అప్పట్లోనే రిజర్వాయర్లు నిర్మించి ఉంటే భారీ వరదలు వచ్చిన ఇలాంటి సమయంలో నీళ్లు నింపుకునే అవకాశం ఉండేదన్నారు.

కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కింద నార్లాపూర్ 8.51, ఏదుల 6.55, వట్టెం 16.74, కరివెన 15.34, ఉద్దండాపూర్ 16.03 టీఎంసీల సామర్ద్యం గల రిజర్వాయర్లను ఏపీ కుట్రలు, కాంగ్రెస్ కుట్రలను చేధించి నిర్మించారన్నారు. ఎన్నికలకు ముందే నార్లాపూర్ లో ఒక పంపును కూడా ప్రారంభించారన్నారు. గత 9 నెలలలో కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని మిగిలిపోయిన అరకొర పనులు పూర్తి చేసి ఉంటే ఈ ఏడాది వట్టెం రిజర్వాయర్ వరకు అయినా ఏదుల రిజర్వాయర్ వరకు అయినా నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉండేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాత టెండర్లు రద్దు చేసి పాలమూరు రంగారెడ్డిని ఉద్దేశ పూర్వకంగా పక్కన పెట్టారన్నారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో వట్టెం పంప్ హౌస్ వరదలకు నీట మునిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ నిర్లక్ష్యం తో కృష్ణాలో నీళ్లున్నా రిజర్వాయర్లను నింపుకునే పరిస్థితి లేదని మండిపడ్డారు. ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పెండింగ్ పనులను వెంటనే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story