Collector : నర్సరీల నిర్వహణ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి..

by Sumithra |
Collector : నర్సరీల నిర్వహణ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలి..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీల నిర్వహణ పై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మోస్రా మండలంలోని గోవూర్ గ్రామంలో గల నర్సరీని కలెక్టర్ గురువారం పరిశీలించారు. స్థానికంగా గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, మోస్రాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కూడా కలెక్టర్ సందర్శించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో జడ్పీ హై స్కూల్ లో చేపట్టిన పనులను పరిశీలించి, ఆయా తరగతుల విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన, డిజిటల్ తరగతుల నిర్వహణ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సామర్ధ్యానికి అనుగుణంగా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలలో నాణ్యమైన బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు సులభంగా ఆకళింపు చేసుకునే విధంగా, వారికి అర్ధమయ్యే రీతిలో పాఠ్యాంశాలు బోధించాలని హితవు పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ 7, 8, 9 తరగతి గదుల్లోకి వెళ్లి, విద్యార్థులకు పలు ప్రశ్నలు అడిగి వారి సామర్ధ్యాన్ని తెలుసుకున్నారు.

ఆయా సబ్జెక్టుల వారీగా వెనుకబడి ఉన్న విద్యార్థులను గుర్తిస్తూ, అలాంటి వారి పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలన్నారు. పాఠశాలలో ఇప్పటికే పూర్తయిన పనులకు ఎం.బీ రికార్డు పూర్తి చేసి నివేదికలు పంపాలన్నారు. తుదిదశలో ఉన్న పనులను వేగంగా పూర్తి చేయించాలని ఆదేశించారు. గోవూర్ లోని నర్సరీని క్షేత్రస్థాయిలో సందర్శించిన సందర్భంగా వివిధ రకాల మొక్కల పెంపకం తీరును కలెక్టర్ ఆసక్తిగా పరిశీలించారు. విత్తనాలు ఎక్కడి నుంచి సేకరించారు, మొలకెత్తిన మొక్కల శాతం ఎంత, ఇప్పటివరకు ఎన్ని మొక్కలు పంపిణీ చేశారు. ఎన్ని మొక్కలు నాటారు అంటూ పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నర్సరీని ఆనుకుని ఉన్న అటవీ భూమి ఎకరం విస్తీర్ణంలో జామ, సీతాఫల్, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను నాటి కోతులు, ఇతర అటవీ జంతువుల కోసం ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడాన్ని గమనించిన కలెక్టర్ స్థానిక అధికారులను అభినందించారు. ఇదే తరహాలో మండలంలోని ఇతర గ్రామ పంచాయతీల పరిధిలో కూడా అవకాశం ఉన్న చోట విరివిగా మొక్కలు నాటి ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. వనమహోత్సవం లక్ష్యాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని అన్నారు.

నర్సరీలలో మొలకెత్తని విత్తనాల స్థానంలో ఇతర మొక్కలు పెంచాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వనమహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంకితభావంతో కృషి చేయాలని అన్నారు. అనంతరం మోస్రా పీహెచ్సీని సందర్శించిన కలెక్టర్, అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు. స్థానికంగా నిర్వహిస్తున్న రక్త పరీక్షలు, రోగులకు అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని రిజిస్టర్లను తనిఖీ చేసిన కలెక్టర్, స్థానికంగా అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డాక్టర్లకు, సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట మండల ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, పంచాయతీరాజ్ ఈఈ శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed