అనుమతులు లేకున్నా.. దర్జాగా మొరం తవ్వకాలు..

by Sumithra |
అనుమతులు లేకున్నా.. దర్జాగా మొరం తవ్వకాలు..
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మాక్లూర్ మండలంలోని గుట్టలను అక్రమ మొరం వ్యాపారులు గుల్ల చేస్తున్నారు. పచ్చని అందాలతో ఆహ్లాదకరంగా ఉండే అందమైన గుట్టలను పచ్చని వన సంపద అయిన చెట్లను నరికి వేస్తూ ప్రకృతి విధ్వంసానికి ఒడిగడుతున్నారు. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలోనే కొండలు పిండి చేస్తూ గుట్టలను గుల్ల చేస్తూ మొరం మాఫియా వ్యాపారులు రెచ్చిపోతున్నా రెవెన్యూ, మైనింగ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలోని జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల మాక్లురు మండలం మొరం అక్రమ తవ్వకాలకు అడ్డగా మారింది. ఎన్నో సంవత్సరాలుగా అడవిగా అల్లుకున్న అందమైన ఆహ్లాదకరమైన గుట్టలను, పచ్చని వేలాది చెట్ల అందాలను ఎలాంటి అనుమతులు లేకుండా మొరం వ్యాపారులు రాత్రి వేళల్లో అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ గుట్టలను గుల్ల చేస్తున్నారు.

అయినా రెవెన్యూ, మైనింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నిబంధనలకు పాదరిస్తూ మైనింగ్ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నట్లు మాక్లూర్ గుట్టలను చూస్తే ఎవరికైనా ఇట్టే తెలుస్తుంది. పచ్చని ఆహ్లాదకరమైన గుట్టలతో అత్యంత ఆకర్షణీయంగా ఉండే గుట్టలు నేడు అక్రమ మొరం వ్యాపారుల మొరం తరలింపులతో ప్రకృతి విధ్వంసం, అటవీ జీవ చరరాశుల మరణాలతో, వేలాది చెట్ల నేలకొరగింపులతో అందవికారంగా తయారయ్యాయి. మాక్లూర్ మండల పరిధిలో గుట్టలను గుల్ల చేసిన మొరం లెక్కలను తీయిస్తే అనుమతుల ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత.. మాక్లూర్ గుట్టలను గుల్ల చేసి మొరం వ్యాపారులు ఎన్ని క్యూబిక్ మీటర్ల మొరం ను తరలించారనే లెక్కలు తీయించాలి. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం ఎంత మొరం వ్యాపారులు తరలించకపోయిన మనం క్యూబిక్ మీటర్ల లెక్కలు ఎంత అనేవి వాస్తవ రూపంలో తెలియనున్నాయి. మాక్లూర్ మండలంలో మాదాపూర్ గ్రామంలో మొరం, ఇసుక అక్రమ వ్యాపారస్తుల నుంచి అందుతున్న నగదు నజరానాలతో రెవెన్యూ, మైనింగ్ అధికారులు మౌనం వహిస్తున్నారని మాక్లూరు మండలంలోని ప్రజలు చర్చించుకుంటున్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమ ఇసుక మొరం వ్యాపారులు దర్జాగా చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఆ వ్యాపారస్తులు లక్షల్లో నగదును సంపాదించుకున్నారు. సుమారు ఏడాది క్రితం రాజకీయ పరిమాణాలు పూర్తిగా మారి రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఓటమికి గురికాగా బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మొరం మాఫియా పై ఉక్కు పాదం మోపడంతో అక్రమ పద్ధతిలో నడుస్తున్న అక్రమ మైనింగ్ మొరం, ఇసుక వ్యాపారాలు ఒక్కసారిగా నిలిచిపోయి. కానీ అక్రమ సంపాదనకే అలవాటుపడ్డ వ్యాపారస్తులు గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో అక్రమ ఇసుక, మొరం మైనింగ్ వ్యాపారాలకు తెర లేపారు. ఈ విషయం బయటకు పొక్కి మాదాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు రాత్రి వేళల్లో గ్రామానికి చెందిన ప్రభుత్వ భూమి 939, 914 సర్వే నంబర్లలో జేసీబీ, టిప్పర్ల సహాయంతో అక్రమంగా మొరం తరలిస్తున్న వ్యాపారుల వద్దకు వెళ్తే మొరం మాఫియా వ్యాపారస్తులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల పై రాళ్లతో దాడి చేయగా పలువురు గాయపడ్డారు.

ఈ తతంగమంతా మాదాపూర్ కేంద్రంగా గల పోలీస్ స్టేషన్ తహశీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే నడుస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొరం మాఫియాను అడ్డుకునేందుకు వెళ్తున్న గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తుల పై మొరం మాఫియా గుండాలు దాడులు చేయడం, బెదిరించడం ఆనవాయితీగా వస్తుంది. సంబంధిత రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులకు ఇవేం పట్టనట్టు మొరం వ్యాపారుల మామూళ్ల మత్తులో జోగుతున్నారు. ఇటీవల మాదాపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యుల పై, గ్రామస్తుల పై రాళ్లతో దాడి చేసిన మొరం వ్యాపారుల పై పోలీస్ స్టేషన్, తహశీల్దార్ కార్యాలయాల్లో ఇటీవల ఫిర్యాదు చేసి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.

అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు జరిపిన వ్యాపారస్తుల పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.. షబ్బీర్, తహశీల్దార్, మాక్లూర్..

అనుమతులు లేకుండా మాదాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా మొరం ఇసుక తవ్వకాలు చేస్తున్న వ్యాపారుల పై చట్టరీత్యా కేసులు నమోదుచేసి కఠినతరమైన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా మొరం ఇసుక తవ్వకాలు జరిపిన వారిపై కేసులతో పాటు మైనింగ్ అధికారుల లెక్కల మేరకు వారి తవ్వకాల ఆధారంగా జరిమాణాలు విధిస్తాం. మాదాపూర్ ఏరియాలో అనుమతులు లేకుండా మొరం తవ్వుతున్నారన్న ఫిర్యాదు మేరకు జేసీబీ టిప్పర్ల పై కేసు నమోదు చేసి, వాటిని స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్లో ఉంచాం. అక్రమ మొరం, ఇసుక వ్యాపారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారి పై తప్పకుండా చర్యలు తీసుకుంటాం అన్నారు.

Advertisement

Next Story