Revanth Reddy: రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం.. నీతి ఆయోగ్ భేటీ బాయ్ కాట్

by Prasad Jukanti |
Revanth Reddy: రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం.. నీతి ఆయోగ్ భేటీ బాయ్ కాట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసెబ్లీ వేదికగా'కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం' తీర్మానం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ సమావేసానికి హాజరుకాకూడదని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. అయితే ఈ నీతి ఆయోగ్ మీటింగ్ ను తమిళనాడు సీఎం స్టాలిన్ బహిష్కరించగా తమ పార్టీకి చెందిన ముగ్గురు సీఎంలు దూరంగా ఉంటారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ విషయంలో తమిళనాడు సీఎం మమతా బెనర్జీ, కేరళ ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినా వారు నీతి ఆయోగ్ సమావేశానికి హజరు అవుతారా లేదా అనేది ప్రకటన చేయలేదు.

నిధులు తెచ్చుడో లేక సచ్చుడో రా..కేసీఆర్ దీక్షకు కూర్చుందాం: రేవంత్

మరో వైపు ఇవాళ శాసన సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి నిధుల విషయంలో తీర్మానం సందర్భంగా శాసనసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నిధుల కోసం మంత్రులు ఢిల్లీలో అమరణ దీక్ష చేయాలని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ దీక్ష గురించి పదే పదే ఉబలాట పడుతున్నారు. కేసీఆర్ ను రమ్మనండి. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్, సభాపక్ష నాయకుడిగా నేను తప్పకుండా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధన కోసం దీక్షకు కూర్చుందాం అని సీఎం అన్నారు. తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరం అయితే సచ్చుడో తేలుద్దాం. ఈ దీక్షకు మేము సిద్ధం. డేట్ ఫిక్స్ చేయండి. కేసీఆర్ ను తీసుకుని రండి అని చాలెంజ్ చేశారు. మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదని, చావునోట్లొ తలపెట్టి తెలంగాణ సాధించామని ఎన్నడూ చెప్పలేదని అన్నారు. దీక్షకు దిగి 24 గంటలు గడవకముందే నిమ్మరసం తాగి సెలైన్సు ఎక్కించుకుని దొంగ దీక్ష తాము చేయలేదు. రూ. వంద పెట్టి పెట్రోల్ కొన్న హరీశ్ రావుకు అగ్గిపెట్టకు పైసలు లేవా అని సెటైర్లు వేశారు. రాజకీయలు రేపటి నుంచి మాట్లాడుకుందాం. ఇవాళ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కులు, నిధులు, అనుమతు కోసం ఏకాభిప్రాయంతో నిలబడితే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచుడు పెద్ద సమస్య కాదన్నారు.

తీర్మానానికి శాసనసభ ఆమోదం:

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశంపై తీర్మానానికి తెలంగాణ శాసన సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని శాసనసభలో తీర్మానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్ర బడ్జెట్ కు సవరణలు చేసి తెలంగాణకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. ఈ తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు తెలుపగా బీజేపీ వ్యతిరేకించింది. శాసనసభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసారు. తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి తెలంగాణపై కేంద్రానిది కక్షపూరిత వైఖరి అని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని, 18 సార్లు కేంద్ర మంత్రులను కలిసి అనే విజ్ఞప్తులు, ప్రతిపాదనలు చేశాం. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరడంతో పాటు చట్టప్రకారం రావాల్సిన నిధులు, అపరిష్కృత సమస్యల పరిష్కారానికి అనేక సార్లు అభ్యర్థనలు అందించాం. ప్రధాన మంత్రి హోదాలో ఉన్న మోడీని పెద్దన్నలా భావించాం. మోడీని పెద్దన్న అని కీర్తిస్తే నాకు వచ్చేదేముంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తిని విస్మరించింది. తెలంగాణను పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో వివక్ష చూపింది. అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరించిన తీరుపై ఈ సభ తీవ్ర అసంతృప్తి, నిరసనను తెలియజేస్తున్నామని అన్నారు.

సెస్సుల రూపంలో ఎగవేత:

బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఈ రోజు పార్లమెంట్ మెట్లమీద ఇండియా కూటమిలోని అన్ని పార్టీలతో కలిసి కాంగ్రెస్ నిరసన తెలిపిందని తెలిపారు. దేశం అభివృద్ధి, ఆదాయంలో తెలంగాణది ఎంతో కీలక పాత్ర ఉంది. కానీ తెలంగాణ పట్ల కేంద్రం వైఖరి ఎలా ఉందో ప్రజలకు తెలియాలన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి పోతే 30 పైసలు కూడా రావట్లేదు. రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.3.67 లక్షల కోట్లు వెళ్లాయి. కేంద్రం మాత్రం తెలంగాణకు పదేళ్లలో కేవలం రూ. 1.68 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది. ఐదు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి రూ.22.66 లక్షల కోట్ల పన్నులు చెల్లించాయి. పదేళ్లలో ఐదు దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చింది కేవలం రూ. 6 లక్షల కోట్లు మాత్రమే అని విమర్శించారు. పన్నుల్లో రాష్ట్రాలకు 42 శాతం నిధులు ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం చెప్పింది. కేంద్రం మాత్రం రాష్ట్రాలకు 32 శాతం పన్నులనే పంచుతోందని చెప్పారు. కేంద్రం పన్నులు కాకుండా సెస్సుల రూపంలో వసూలు చేసుకుని రాష్ట్రాలకు ఎగ్గొడుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలి. అందరం ఏకతాటిపైకి వచ్చి కేంద్రం మెడలు వంచాలి, నిధులు సాధించుకోవాలన్నారు.



Next Story