MLA Jagadish Reddy's : కాళేశ్వరంపై కాంగ్రెసోళ్లది అంతా దుష్ప్రచారమే…

by Kalyani |
MLA Jagadish Reddys : కాళేశ్వరంపై కాంగ్రెసోళ్లది అంతా దుష్ప్రచారమే…
X

దిశ , సూర్యాపేట : కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిందని సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కో-టీం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని మాజీ మంత్రి,సూర్యాపేట గుంటకండ్ల ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి కోరారు. భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మి బ్యారేజ్ 19,20 పిల్లర్లు కృంగాయని చేపట్టిన అధ్యయనాలను తెలుసుకునేందుకు బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం సందర్శనకు వెళ్ళారు. ఈ సందర్భంగా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరంపై సీఎంతో మంత్రులు, ఎమ్మెల్యేలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏ ఒక్క పిల్లర్ కృంగి నట్లు ఇక్కడ కనిపించడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఇప్పటికీ 10 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం సాగుతోందన్నారు. గతంలో కూడా సుమారు 28 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగిందని చెప్పారు.

ఇంకా పెద్ద మొత్తంలో నీటి ప్రవాహం వచ్చినా ఈ ప్రాజెక్టు తట్టుకోగలదని వెల్లడించారు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదని ఇంజనీర్లు చెపుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అభాసుపాలు చేయాలని చూస్తోందని ఆరోపించారు. కన్నెపల్లి వద్ద ఉన్న పంప్ హౌస్ లో ఒక్క బటన్ నొక్కితే మిడ్ మానేరు,లోయర్ మానేరు మీదుగా కాకతీయ రిజర్వాయర్ ద్వారా రైతు పంట పొలాలకు సూర్యాపేట వరకు నీరు తరలించవచ్చనారు.ఇది చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ ను బదనాం చేయాలనే దుర సంకల్పంతో కాలువలను నీటిని విడుదల చేయకుండా నిలిపిందని ఆరోపించారు. మేడిగడ్డకు మరమ్మతులు పూర్తి అయ్యాక బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు తొలిసారి మేడిగడ్డకు వెళ్లడం విశేషం.కాగా గురువారం ఇదే నాయకులు ఎల్ఎండి రిజర్వాయర్ ని సందర్శించిన విషయం తెలిసిందే.



Next Story