Collector Tejas Nandalal Power : మహిళలు స్వశక్తితో ఎదగాలి..

by Sumithra |
Collector Tejas Nandalal Power : మహిళలు స్వశక్తితో ఎదగాలి..
X

దిశ, పెన్ పహాడ్ : పొదుపు సంఘాల ద్వారా మహిళలకు ప్రభుత్వం అందించే చేయూతను సద్వినియోగం చేసుకొని, మహిళలు స్వశక్తితో ఎదగాలని మహిళా సాధికారత సాధించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సర్ఫ్ కార్యాలయంలో నెలవారీగా నిర్వహించే సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మహిళల కోసం బ్యాంకు లింకేజీ, శ్రీనిధి ద్వారా కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకున్న మహిళలు తమ కుటుంబాల కోసం వారి జీవనోపాధికి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతారని అన్నారు. మండలంలో మొత్తం 887 పొదుపు సంఘాలు ఉండగా 9350 మంది సభ్యులు, 29 సంఘం బంధాల్లో కొనసాగుతున్నారని అన్నారు.

వారిలో చురుకైన మహిళలను గుర్తించి వారికి బ్యాంకు లింకేజీ ద్వారా జీవనోపాదుల్లో భాగంగా పెరటి కోళ్ల పెంపకం, గేదెలు, పౌల్ట్రీ, చిన్న పరిశ్రమలు, ఎంటర్ప్రైజెస్, ఈ సేవ, నాటు కోళ్ల పెంపకం, వ్యవసాయంత్రాల పరికరాల అద్దె నిర్వహణ లాంటి స్వయం ఉపాధి పనులను కల్పించడం ద్వారా మహిళలు ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు. ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణలో సంఘ బంధాల అధ్యక్షురాళ్ళను భాగస్వామ్యం చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందించే దుస్తులను మహిళా సంఘాల ద్వారా టైలరింగ్ చేయించి పాఠశాలలు ప్రారంభం కాకముందే విద్యార్థులకు ఒక జత అందించామన్నారు. ప్రభుత్వం నిర్వహించే ప్రతి పనిలో మహిళా సంఘాలు భాగస్వాములు కావాలన్నారు. వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు అనంతారం గ్రామానికి చెందిన శిరీష నిర్వహిస్తున్న పచ్చడ్ల వ్యాపారం పై ఆరా తీశారు.

అదేవిధంగా అన్నారం గ్రామానికి చెందిన మహిళ ధనలక్ష్మి పాల ఉత్పత్తి కేంద్రం పై ఆర్జిస్తున్న లాభనష్టాలు తెలుసుకున్నారు. లింగాల గ్రామానికి చెందిన వీవోఏ మల్లేశ్వరి నిర్వహిస్తున్న చికెన్ వ్యాపారం, కారం మిల్లు నిర్వాహణ పై తనకు లభిస్తున్న ఆదాయ వ్యయాలను అడిగి తెలుసుకున్నారు. కాగా లింగాల గ్రామంలోని వీవోఏ సంఘం అధ్యక్షురాలు శాంతకుమారి శ్రీనిధి నుంచి లోన్లు తీసుకొని పూర్తిగా చెల్లించినప్పటికీ తమకు పావలా వడ్డీలు అందడం లేదని మహిళలు అడుగుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం త్వరలోనే వడ్డీలు చెల్లిస్తుందని కలెక్టర్ తెలియజేశారు. పొదుపు సంఘాల బలోపేతానికి గ్రామాల్లోని విధి నిర్వహణలో ఉన్న వివోఏలు నిధులను సక్రమంగా నిర్వర్తించాలని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న మహిళా శక్తి పథకాన్ని మహిళలు అందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళా శక్తి పథకం పై మహిళలకు అవగాహన కల్పించారు. అంతకుముందు సెల్ఫ్ కార్యాలయానికి విచ్చేసిన కలెక్టర్ కు మహిళలు పూలగుచ్చం అందించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ పీడీ మధుసూదన్ రాజు, ఏపీడీ సురేష్, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, ఎంఈఓ నకిరేకంటి రవి, మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు ఊటుకూరి మంజుల, కార్యదర్శి నాగమణి, కోశాధికారి ఉపేంద్ర, ఇన్చార్జి తహశీల్దార్ లాలూ నాయక్, ఏవో కృష్ణ సందీప్, డీపీఎంలు రత్తయ్య, లక్ష్మీనారాయణ, గోవిందు, ఆంజనేయులు, ఏపీఎం అజయ్ నాయక్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటమ్మ, అన్ని గ్రామాల సంఘ బంధం అధ్యక్షురాండ్లు, వివోఏలు, తదితరులు పాల్గొన్నారు.



Next Story