ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా కవిత: కాంగ్రెస్ MLA సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అప్రూవర్‌గా కవిత: కాంగ్రెస్ MLA సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అప్రూవర్‌గా మారుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత అప్రూవర్‌గా మారకుండా ఉండడానికి కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టాడని.. ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. శనివారం ఎమ్మెల్యే యెన్నం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయి.. వాటి కోసం తెచ్చిన అప్పులు మాత్రం కట్టాల్సి వస్తుందని ఫైర్ అయ్యారు. భూస్వాములకు, రియల్టర్లకు రైతు బంధు అమలు నిలిపివేస్తున్న దమ్మున్న సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు. రాష్ట్రంలో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరిస్తున్నాడని, నిరంతరం ప్రజల కోసం తపనపడుతున్నాడన్నారు. పాఠశాలల ప్రారంభంలోనే పిల్లలకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేశారని గుర్తు చేశారు.

బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో కేసీఆర్ పరిష్కరించలేని సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరిస్తున్నాడన్నారు. కేసీఆర్ ప్రధాని మోడీ దగ్గరికి పోవడానికి భయపడితే.. రేవంత్ రెడ్డి ధైర్యం ప్రధాని వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. మిషన్ భగీరథకు రూ.50 వేల కోట్లు ఖర్చు పెట్టారని.. అందులో మొత్తం అవినీతి, అక్రమాలేనని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ తీసుకొచ్చిన కాళేశ్వరం, మిషన్ భగీరథ ఏ పథకం చూసినా అవినీతి, అక్రమాలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం సిగ్గు పడకుండా రాజకీయ మనుగడ, పబ్బం కోసం కుటుంబం మొత్తం ఆరాటపడుతుంటే క్యాడర్ కూడా నవ్వుకుంటుందని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తూ కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ఈ సందర్భంగా యెన్నం కోరారు.

Next Story

Most Viewed