Madhavaram Krishna Rao: అధికారం మీ చేతుల్లోనే ఉంది విచారణ చేయండి

by Gantepaka Srikanth |
Madhavaram Krishna Rao: అధికారం మీ చేతుల్లోనే ఉంది విచారణ చేయండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు చెరువులు ఆక్రమిస్తే అధికారం మీ చేతుల్లో ఉంది విచారణ చేసుకోండి.. చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రా పేరుతో మూడు నెలల నుండి హైదరాబాద్ ప్రజలను భయపెడుతున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్స్ తో అఖిలపక్షం నిర్వహించాలని సీఎంను కోరామని, అందుకు సుముఖత వ్యక్తం చేయడంతో నిర్వహిస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అఖిలపక్షం ఎప్పుడో పెట్టి ఉంటే బుచ్చమ్మ చనిపోయేది కాదన్నారు.

హైదరాబాద్ నగరంలో గతంలో ఎన్ని చెరువులు ఉన్నాయి.. ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నల్లచెరువులో బీఆర్ఎస్ నేతల ఆక్రమణలు ఉన్నాయని సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ఎవరు ఆక్రమణలు చేశారో సీఎం నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. నల్ల చెరువు చుట్టూ బీఆర్ఎస్ పాలనలో కట్ట నిర్మాణం చేపడితే, రైతులు కోర్టుకు వెళ్ళడంతో జీహెచ్ఎంసీ అధికారులు కట్టను తొలగించారన్నారు. కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎస్టీపీలను నిర్మించామని, కాజాకుంటలో ఇద్దరు జడ్జీలకు ఏ పార్టీ నేతలు భూములు అమ్మారో సీఎం విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.

ఎన్నో ఏళ్లుగా నివసిస్తున్న ప్రజలను కబ్జాదారులు అనడం సరికాదన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఒప్పించి వారి ఇళ్లను ఖాళీ చేయించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, చెరువులు ఎవరు కబ్జా చేశారో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ మాత్రమేనని, హైదరాబాద్ ప్రజలను వేధించవద్దు అని కోరారు. కేంద్రం నుండి బీజేపీ హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. హైడ్రా భాదితులకు అండగా బీజేపీ నుండి ఈటల రాజేందర్ మాత్రమే మాట్లాడుతున్నారని మిగతావారు ఎటుపోయారని ప్రశ్నించారు. చెరువులపై ఒక్కో డిపార్ట్మెంట్ దగ్గర ఒక్కో ప్లాన్ ఉందని, నిరుపేదల జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed