తల తాకట్టు పెట్టి అయినా సరే ఆ పని చేసి తీరుతాం.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

by Gantepaka Srikanth |
తల తాకట్టు పెట్టి అయినా సరే ఆ పని చేసి తీరుతాం.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైతు(Telangana Farmer)లను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు(Minister Tummala Nageswara Rao) భరోసా ఇచ్చారు. గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మార్కెట్ కమిటీ కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వర రావు పాల్గొని మాట్లాడారు. తల తాకట్టు పెట్టి అయినా సరే రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అతి త్వరలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

పదేళ్ల పాటు రైతులను దగా చేసిన మాటలను అస్సలు నమ్మొద్దని హితవు పలికారు. గత ప్రభుత్వం ఏనాడూ రుణమాఫీపై నోరు మెదపలేదని తెలిపారు. ఏడాదిలోపు రూ.300 కోట్లతో జిల్లాలో పామాయిల్ పరిశ్రమ తీసుకొస్తామని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఇతర దేశాల నుంచి రూ.లక్ష కోట్లు పెట్టి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం.. ఇక నుంచి ఆ పరిస్థితి రాకుండా దేశానికి ఆయిల్‌ను అందించే బాధ్యత తెలంగాణే తీసుకోవాలని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులను రుణ విముక్తులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. తన కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఆయిల్‌పామ్‌ గెలల ధర టన్నుకు రూ.14,392 నుంచి రూ.17,043కి పెరిగిందని మంత్రి తుమ్మల గుర్తుచేశారు.

Next Story

Most Viewed