తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టండి: మంత్రి పొన్నం ఆగ్రహం

by karthikeya |   ( Updated:2024-10-15 08:30:22.0  )
తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టండి: మంత్రి పొన్నం ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దసరా సెలవుల అనంతరం గురుకులాలు, కాలేజీలు, పాఠశాలలు ప్రారంభం అవుతున్నాయని, 70 శాతం గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతుయని చెప్పిన మంత్రి.. గురుకుల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు ఈ 10 నెలల్లో పెట్టినవి కాదని, గత ప్రభుత్వ హయాంలో పెట్టిన బకాయిలే ఎక్కువగా ఉన్నాయని, ఈ విషయాన్ని యజమానులు గమనించాలన్నారు. ఇప్పటికే ఈ విద్యాలయ భవనాల బకాయిల విషయంపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నాయకత్వంలో చర్చించామని, చెల్లింపులపై సమావేశాలు కూడా నిర్వహించామని చెప్పారు.

నేడో, రేపు నిధులు విడుదల చేసే సమయంలో ఎవరో చెప్పిన మాటలు నమ్మి కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని భవనాల యజమానులకు హితవు పలికారు. ‘‘బకాయిలు చెల్లింపుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రక్రియ కొనసాగుతోంది. గురుకుల మంత్రిగా విజ్ఞప్తి చేస్తున్నాను.. గురుకులాల వద్ద పెట్టిన బ్యానర్లు వెంటనే తొలగించి.. సక్రమంగా తరగతులు కొనసాగనివ్వండి. నేను, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అన్ని గురుకులాలపై సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులకు స్వాగతం పలకండి. విద్యాబోధనకు ఆటంకం కలిగిస్తే చట్టపరంగా చర్యలు ఎదుర్కోవలసి ఉంటుంది.

మీకు బకాయిని చెల్లించే బాధ్యత మాది లేదంటే నన్ను గాని, ముఖ్యమంత్రిని కానీ, అదీ కుదరకపోతే అధికారులను కలవండి. పాత బకాయిలతో సహా మెస్ చార్జీలు కూడా 3 రోజుల క్రితమే చెల్లించాం. ఇకపై ఎవరైనా గురుకుల భవనాలకు తాళాలు వేస్తే కఠిన చర్యలు ఉంటాయి. ఎక్కడైనా యజమానులు ఇబ్బందులు పెడితే గురుకుల ప్రిన్సిపల్ అర్సీవోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయండి. సదరు యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కలెక్టర్లకి కూడా ఆదేశాలిస్తున్నాం. ప్రత్యామ్నాయంగా అక్కడ నుండి ఖాళీ చేసి వేరే భవనాలు చూడండి’’ అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

Next Story

Most Viewed