దేశ రక్షణ, శాంతి భద్రతలు, ఆత్మగౌరవం, ఆర్థికాభివృద్ధిని కాపాడగలిగే శక్తి కేవలం మోదీకే ఉంది: ఈటల

by Disha Web Desk 23 |
దేశ రక్షణ, శాంతి భద్రతలు, ఆత్మగౌరవం, ఆర్థికాభివృద్ధిని కాపాడగలిగే శక్తి కేవలం మోదీకే ఉంది: ఈటల
X

దిశ,కూకట్​పల్లి: దేశ రక్షణ, శాంతి భద్రతలు, దేశ ఆత్మగౌరవం, దేశ ఆర్థికాభివృద్ధిని కాపాడగలిగే శక్తి కేవలం ప్రధాని నరేంద్ర మోదీకే ఉందని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్​ అన్నారు. కూకట్​పల్లి నియోజకవర్గం పరిధిలో ఈటెల రాజేందర్​ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూకట్​పల్లి కోర్టు కాంప్లెక్స్​లో న్యాయవాదులను కలిసి వారి మద్దతును కోరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ సమాజంలో మంచి, చెడులు తెలిసిన న్యాయవాదుల మద్దతు తనకు కావాలని కోరారు. అనంతరం బాలానగర్​ డివిజన్​ పరిధిలోని ఇందిరానగర్​ గుడిసెలు, శ్రీశ్రీ నగర్​ కాలనీలలో ఇంటింటికి వెళ్లి బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్​ మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతలను, దేశ రక్షణ, దేశ ప్రజల ఆత్మగౌరవం, దేశ ఆర్థికాభివృద్ధిని ఏక కాలంలో కాపాడగలిగే శక్తి కేవలం ప్రధాని నరేంద్ర మోదీకే ఉందని అన్నారు.

బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు ఎన్నికల్లో డబ్బును, మద్యాన్ని నమ్ముకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందని, బీజేపీ మాత్రం దేశాభివృద్ధిని చూపిస్తు ఓట్లు అడుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి అబద్ధపు హామీలను ఎన్నో ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. రేవంత్​ రెడ్డి, కేసీఆర్​ మోసపూరిత మాటలను గ్రహించిన ప్రజలు అబ్​కీ బార్​ చార్​సౌ పార్​, ఫిర్​ ఏక్​ బార్​ మోదీ సర్కార్​ అంటూ బీజేపీ పార్టీకి పట్టం కట్టేందుకు నిర్ణయించుకున్నారని అన్నారు. అనంతరం అల్లాపూర్​ డివిజన్​లోని రాజీవ్​గాంధీ నగర్​ సి బ్లాక్​లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ నల్లపోచమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బీజేపీ ఇన్​చార్జ్ మాధవరం కాంతారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్​ రావు తదితరులు పాల్గొన్నారు.



Next Story