Govt ITI College: ప్రారంభానికి సిద్ధంగా బాలికల ఐటీఐ కళాశాల..!

by Maddikunta Saikiran |
Govt ITI College: ప్రారంభానికి  సిద్ధంగా బాలికల ఐటీఐ కళాశాల..!
X

దిశ, ఘట్కేసర్: మేడ్చల్(Medchal) జిల్లాలో మరో ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాల(Govt Girls ITI College) ప్రారంభానికి సిద్ధమైంది. ఘట్కేసర్ మున్సిపాలిటీ(Ghatkesar Municipality) కొండాపూర్‌(Kondapur)లో మూడెకరాల విస్తీర్ణంలో రెండంతస్తుల భవనాన్ని అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంస్థ సీఎస్‌ఆర్ నిధులు రూ. 7 కోట్లతో ఐటీఐ భవనాన్ని నిర్మించింది.

ఐదు కోర్సులు ..

పదో తరగతి పూర్తి చేసి ఉన్నత విద్య అభ్యసించలేని వారికి ఐటీఐ విద్య చక్కని అవకాశం. ఇందులో వివిధ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు అప్రెంటిస్(Apprentice) పూర్తి చేస్తే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో టెక్నీషియన్లుగా అవకాశాన్ని పొందుతారు. కొండాపూర్‌లో కేవలం బాలికల కోసం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటుపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలికల కోసం ఎలక్ర్టీషియన్, ఎలక్ట్రానిక్, మెకానిక్, ఫ్యాషన్ డిజైనింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ ఎయిడెడ్ ఎంబ్రాయిడరీ డిజైనింగ్, కోప(కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ ) లాంటి ఐదు కోర్సులను అందించనున్నారు. ఒక్కో కోర్సులో 40 మంది చొప్పున విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ నూతన భవనంలో అత్యాధునిక సౌకర్యాలతో కంప్యూటర్ ల్యాబ్(Computer Lab)బాలికల కోసం హాస్టల్(Hostel) సైతం ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా ఐటీఐ కళాశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థుల కల సాకారం కానుంది. కళాశాల ప్రారంభానికి ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఐటీఐ కళాశాల రావడం సంతోషదాయకం: మున్సిపల్ ఛైర్ పర్సన్ పావనీ జంగయ్యయాదవ్

ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఐటీఐ బాలికల కళాశాల రావడం చాలా సంతోషంగా ఉంది. పేద విద్యార్థులు ఐటీఐ విద్య అభ్యసించి జీవితంలో స్థిరపడేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా బాలికల కోసం ఐదు కోర్సులను అందించడం, ప్రత్యేకంగా ఫ్యాషన్ డిజైనింగ్(Fashion Designing), ఎంబ్రాయిడరీ(Embroidery) లాంటి కోర్సులను అందించడం బాగుంది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం: శంకరయ్య, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్

వచ్చే సంవత్సరం నుంచి ఐటీఐ బాలికల కళాశాల అడ్మిషన్స్ ప్రారంభమవుతాయి. జిల్లాలో మేడ్చల్(Medchal), అల్వాల్(Alwal), శామీర్‌పేట(Shamirpet)లో ప్రభుత్వ ఐటీఐలు ఉండగా ప్రస్తుతం కొండాపూర్ లో ప్రారంభం కానుంది. అన్ని సౌకర్యాలతో భవనం పూర్తి కాగా ప్రభుత్వం సిబ్బంది, ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.

Next Story