డిప్యూటీ మేయర్ భూ కబ్జాపై కొరడా..

by Sumithra |
డిప్యూటీ మేయర్ భూ కబ్జాపై కొరడా..
X

దిశ, జవహర్ నగర్ : ప్రభుత్వ స్థలం కబ్జా పై రెవెన్యూ యంత్రాంగం కొరడా ఝులిపించింది. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్ లో గల సర్వే నంబర్ 804 లోని ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని రెవెన్యూ కస్టడిలోకి తీసుకుంది. ప్రభుత్వ స్థలాన్ని జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ కబ్జా చేశాడని, ఈ స్థలాన్ని ఇప్పటికే స్కూల్ కు కేటాయించినట్లుగా తాహశీల్దార్ సుచరిత మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించే క్రమంలో అక్రమార్కులు కబ్జాదారులు ఎంతటి వారైనా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ ఆధీనంలో ఉన్న రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోని పెన్సింగ్ ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.

దళారుల మాటలు నమ్మెద్దు..

దళారుల మాటలు నమ్మి అక్రమ లే-ఔట్లలో ప్రజలు ఫ్లాట్లను కొని మోసపోవద్దని తాహశీల్దార్ సుచరిత సూచించారు. జవహర్ నగర్ లో 500 ఎకరాల ప్రభుత్వ స్థలాలను గుర్తించినట్లు చెప్పారు. త్వరలోనే ఆయా స్థలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. అయితే కొందరు కోర్టులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ స్థలాల్లో రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ అండదండలతో అమాయకులకు ప్లాట్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. దళారుల మాటలు నమ్మి ప్లాట్లు కొనుగోలు చేసుకుని ఇండ్లు కట్టుకున్నారని తెలిపారు. అదేవిధంగా కొందరు ఎకరాల కొద్ది ప్రభుత్వ స్థలాలను తమ ఆధీనంలో తీసుకున్నారని, ఇలాంటివి 500 ఎకరాల వరకు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వీటిని 160 పార్టులుగా విభజించి,జియోట్యాగింగ్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు.

కేసుల పై ఆరా..

జవహర్ నగర్ అంతటా ప్రభుత్వ భూములే ఉన్నాయి. అయితే గతంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసుకుని అమ్ముకోవడం వల్ల పలువురి పై అల్వాల్, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో భూ కబ్జాదారుల పై ఎన్ని కేసులు ఉన్నాయో వివరాలను ఇవ్వాలని జవహర్ నగర్ పోలీసులను కోరినట్లు తాహశీల్దార్ సుచరిత తెలిపారు. అత్యధిక కేసులున్న వారి పై పీడీ యాక్టు నమోదు చేయాలని కలెక్టర్ కు నివేదిక ఇస్తామన్నారు. భూ కబ్జాదారులు ప్రభుత్వ భూముల జోలికి వస్తే సహించబోమని, రాజకీయంగా ఎంత పలుకుబడి ఉన్నా.. సరే ఊపేక్షించబోమని సుచరిత హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed